చారిత్రక ప్రాజెక్టుకు నేడే శ్రీకారం
శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ తాగునీటి కష్టాలకు చెక్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మించనున్నది. దీంతో నాగార్జునసాగర్ జలాశయంలో నీటి పరిమాణం డెడ్స్టోరేజీకి చేరినప్పటికీ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదు.
పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు శనివారం తన సహచర మంత్రులైన మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు జలమండలి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.1,450 కోట్ల వ్యయం తో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల హెడ్వర్క్స్ నిర్మాణంతోపాటు అండర్ గ్రౌండ్ షాఫ్ట్, ఇన్టేక్ టన్నెలింగ్, పంప్హౌస్, విద్యుత్ సబ్స్టేషన్, సుంకిశాల నుంచి కోదండపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు 2,375 ఎంఎం డయా పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానున్న ఈ ప్రాజెక్టు నుంచి ఏటా వేసవిలో ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేసి హైదరాబాద్ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తొలగించనున్నారు.