హైదరాబాద్: హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటడం అంత సులువు కాదు. నలువైపులా నుంచి వచ్చే వాహనాలతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక సెలవు రోజులు, పండుగ సీజన్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పాదచారులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 1,000 టన్నులకు పైగా స్టీల్ను వినియోగించారు.
ఇక ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని శిల్పారామంలో రూ.10 కోట్ల వ్యయంతో సమావేశాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కన్వెన్షన్ హాలును మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.