KTR | కామారెడ్డి : మిగిలిన రుణమాఫీ మిత్తితో సహా కట్టించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పరిధిలోని బీబీపేట్లో నిర్వహించిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కరోనాతో రెండేండ్ల పాటు లక్ష కోట్లు నష్టం వచ్చింది. పిండి కొద్ది రొట్టెలాగా.. రుణమాఫీ రూ. 19 వేల కోట్లకు గానూ రూ. 14 వేల కోట్లు నిండింది. ఇంకా రూ. 5 వేల కోట్లు మిగిలింది. అది కూడా బరాబర్ ఇచ్చే బాధ్యత మాదే. దయచేసి ఎవరూ రందీ పెట్టుకోవద్దు. రూ. 2 వేల కోట్లు మిత్తి పైసలు కూడా బరాబర్ కట్టించే బాధ్యత మాది.. మీ మీద భారం వేయం. రుణమాఫీ మొత్తం చేస్తాం అనే మాట మనవి చేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటో పోతే వార్త. ఇది వాస్తవం. కాంగ్రెసోళ్లు గతంలో ఆరు గంటల కరెంట్ అన్నరు.. ఎన్నడూ మూడు గంటలు దాటి ఇవ్వలేదు వ్యవసాయానికి. అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం బావుల కాడికి పోయి ఆగమైన బతుకులు ఎన్నో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. పాము కాట్లు, తేలు కాట్లు. అర్ధరాత్రి బావుల కాడికి పోతుంటే నక్సలైట్లు అని పోలీసుళ్లు కాల్చి చంపిన రోజులను గుర్తుకు తెచ్చుకోండ్రి. కాంగ్రెస్ హయాంలో కేవలం కరెంట్ మాత్రమే కాదు.. ఎవుసం మాత్రమే నాశనం కాలేదు.. చెరువులో ఎండిపోయాయి. బోర్లలో నీళ్లు ఉండేవి కావు. మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఎండిపోయిన వరితో సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు. మద్దతు ధర దొరికేది కాదు.. కొనుగోలు కేంద్రాల్లేవు. ఇప్పుడు రోడ్లపై పుట్లకు పుట్లకు వడ్లు పండుతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లపై ధాన్యపు రాశులు కనబడుతున్నాయి అని కేటీఆర్ తెలిపారు.
అసైన్డ్ భూముల మీద కూడా మీకే హక్కులు కల్పిస్తాం. కావాలంటే అమ్ముకోవచ్చు, పిల్లలకు ఇచ్చుకోవచ్చు. బ్యాంకులో ఆ భూమి కాగితాలు పెట్టి లోన్లు కూడా తీసుకోవచ్చు. అసైన్డ్ భూములు ఉన్న దళితులు, గిరిజనులకు మేలు జరుగుతది. రైతు, ఎద్దు, ఎవుసం తెలవని ఇలాంటి సన్నాసులకు ఓట్లేసి ఆగం అవుదామా.? లేదా కేసీఆర్ను గెలిపించుకుని ఎవుసం బాగు చేసుకుని, మన బతుకులను బాగు చేసుకుందామా? అనేది ఆలోచించి ఓటేయండి. కేసీఆర్ గెలిస్తే ప్రతి గ్రామానికి నిధుల వరద వస్తది. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయిన తర్వాత నిధులకు కొరత ఉండదు. వడ్డించేటోడు మీ వ్యక్తి అయిన తర్వాత బంతిలో ఏక్కడ కూర్చున్నా మూలుగు బొక్క పడుతది. ఫాల్త్ గాడు వచ్చి చెప్పే ఫాల్త్ మాటలు నమ్ముతారా..? గల్లీతో సంబంధం లేనోడికి.. ఢిల్లీ మాట వినేటోడి తోటి పనులు అవుతాయా..? కేటీఆర్ ప్రశ్నించారు.
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తరని చెప్తరు. అట్ల ఇవాళ కామారెడ్డికి కేసీఆరే స్వయంగా కదిలి వచ్చిండు. మరి కామారెడ్డికి కేసీఆర్ వస్తే మీకు ఏం డోఖా ఉంటదో ఆలోచించండి. అన్ని సౌలత్లు వస్తాయి. అన్ని పనులు జరుగుతాయి. నేను గెలుస్తా.. మావోళ్లు గెలిపిస్తరు అందులో మాకేం ఇబ్బంది లేదు కాని కేసీఆర్ వస్తే దశాబ్దాల దరిద్రం మొత్తం రెండేండ్లలో పీకుతది మా కామారెడ్డిది అని గోవర్ధన్ అన్నారు. మాకు గోదావరి నీళ్లు వస్తాయి. ప్రతి ఊరికి నిధులు వస్తాయి. ప్రతి మండలంలో కాలేజీలు వస్తాయి. అన్ని మంచిగా జరుగుతాయి. నేను సింగిల్ విండో చైర్మను నుంచి ఎమ్మెల్యేదాకా ఎదిగాను. కేసీఆర్ ఆశీర్వాదంతో కేబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్గా ఉన్నా. సార్ దయ ఉంటే వేరే పదవికి కూడా వస్తది కానీ.. కామారెడ్డి బాగుపడాలని కేసీఆర్ను ఆహ్వానించానని తెలిపారు. మంచి మనసున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అని కేటీఆర్ ప్రశంసించారు.