దశాబ్దాల ఫ్లోరోసిస్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ది. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నపుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఖుదాభక్ష్పల్లి గ్రామంలో శాసనసభ్యుల బృందం పర్యటించాం. అక్కడ బాధితులను చూస్తే కండ్లల్లో నీళ్లొచ్చాయి. ఫోరోసిస్తో వంకర్లు తిరిగిన కాళ్లు, చేతులతో భూమికి రెండు మూడు అడుగుల ఎత్తే ఉన్నారు. ఇవన్నీ ఒకప్పుడు యథార్థమే అయినా.. ఇప్పుడు కథగా కనిపిస్తాయి. ఎందుకంటే దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా మిషన్ భగీరథతో తెలంగాణలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేశాం. ఆరేండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన అద్భుత విజయం. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా మిషన్ భగీరథను ప్రశంసించడం తెలంగాణ సాధించిన విజయగాథ.
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు శాసనసభకు బీజేపీ నుంచి పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కంపెనీ ‘సుశీ ఇన్ఫ్రా’కు బీజేపీ సర్కారు రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కాంట్రాక్టులో రాజగోపాల్రెడ్డికి రూ.5 వేల కోట్లు మిగులుతాయని, అందుకే బీజేపీలో చేరారని విమర్శించారు. ‘ఇటీవల అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు కొంతమంది పెద్ద మనుషులను కలిశారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారు అని వారితో అన్నారు.
ఓటుకు రూ.20-25 వేలు ఇచ్చి అయినా సరే ఓట్లను కొనేందుకు బీజేపీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కాంట్రాక్టర్కు, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. మునుగోడు ప్రజలపై ఉప ఎన్నికలను బలవంతంగా రుద్దారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలువడం ఖాయం. ఇప్పటికే 3-4 సర్వేలు వచ్చాయని, టీఆర్ఎస్ అభ్యర్థి 14 శాతం లీడ్తో ఉన్నారు. 2-3 స్థానాల కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. మునుగోడులో పార్టీ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కమిటీలు వేశామని, పార్టీ నాయకత్వం మొత్తం కల్సికట్టుగా పనిచేస్తుంది’ అని అన్నారు.
అధికారమే పరమావధి కాదు
పార్టీలో చేరుతామని ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి అనేక మంది వస్తున్నారని, రోజూ మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే చేరికలకు సంబంధించి ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నదని, బీఆర్ఎస్కు ఆ సమయం సరిపోతుందని పేర్కొన్నారు. తమకు లోక్సభ ఎన్నికలు ముఖ్యమని, గుజరాత్ శాసనసభ ఎన్నికలు తదితర వంటివాటిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఇప్పటికిప్పుడు 28 రాష్ట్రాల్లో పోటీచేయలేమని, మనకున్న శక్తి, వనరులు, అవకాశాలు, వ్యూహం అన్నింటినీ బేరీజు వేసుకొని పోటీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక పార్టీని ఓడించి.. ఇంకో పార్టీ గద్దెనెక్కాలన్నది మా విధానం కాదు. అధికారమొక్కటే మాకు పరమావధి కాదు. ప్రజల అవసరాలపై ప్రాధానంగా చర్చ జరగాని కోరుకొంటున్నాం. ప్రజల మౌళిక అవసరాలైన తాగు, సాగునీరు, రైతులు, దళితులు తదితరులకు మేలు జరగాలన్నదే మా రాజకీయ లక్ష్యం. ఆహార భద్రతపై, రైతుల కష్టాలపై అవగాహన లేని ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. వీటిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉండగా.. కులం, మతం ప్రాతిపదికగా ప్రజలను విడదీస్తున్నారు’ అని విమర్శించారు.
తెలంగాణ కేంద్రంగానే బీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడం వల్ల ఎలాంటి తేడా రాదని, తెలంగాణ కేంద్రంగానే కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లో పోటీచేయలేమని, అందుకే భారత్ రాష్ట్ర సమితిగా పేరు పెట్టాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, పార్టీ రంగు గులాబీ, జెండా, పార్టీ గుర్తులు మారడంలేదని తెలిపారు. టీఆర్ఎస్కు ప్రజల మనసులో ఏ స్థాయిలో గుర్తింపు ఉన్నదో బీఆర్ఎస్కు కూడా అదే స్థానం ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ గుజరాతీ పార్టీగా ఉన్నట్టే.. బీఆర్ఎస్ తెలంగాణ పార్టీగానే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని అన్నారు. తాను ఇటీవల గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పోస్టర్ చూశానని, స్థానిక క్యాబ్ డ్రైవర్ దాన్ని చూసి బెంగాలీ పార్టీ అని చెప్పారని, ఎక్కడ ఉన్నా.. స్థానిక గుర్తింపు అలాగే ఉంటుందని వివరించారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. నరేంద్రమోదీ 2014లో గుజరాత్ సీఎంగా ఉంటూనే దేశవ్యాప్తంగా వందకుపైగా సభల్లో పాల్గొన్నారని, కేసీఆర్ కూడా అలాగే ప్రచారం చేస్తారని చెప్పారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ అంటూ వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు.