వేములవాడ: కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని.. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అని మంత్రి ప్రశ్నించారు.
‘2014కు ముందు తెలంగాణల కరెంటు గోస ఎట్లుండె. ఎవరన్న చచ్చిపోతే స్నానాల కోసం ఒక్క అరగంట కరెంటు ఇయ్యమని బతిమాలేటోళ్లు. రాత్రిపూట కరెంటు వచ్చేది. పొలాలకు నీళ్లు పెడుతందుకు రైతులు అర్ధరాత్రి బావుల కాడికివొయి పాములు కరిచి, తేళ్లు కరిచి చచ్చిపోయిండ్రు. దినమంత పనిచేసి కాసేపు పండుకుందామంటే కరెంటు లేక ఇంట్లె పంక తిరగకపోయేది. కరెంటు లేక ఇంత అస్తవ్యస్తమైన జీవితం ఉండేది. ఇప్పుడు ఆ అవస్తలు అన్నీ తీరిపోయినయ్. కాంగ్రెసోడు 60 ఏండ్లు చేయని పని, మేం ఆరున్నర ఏండ్లళ్ల చేసినం. దయచేసి మీరంతా బాగా ఆలోచించండి. ఆలోచింది ఓటేయండి’ అని మంత్రి ఓటర్లను కోరారు.
‘ఎండకాలం వస్తే ఊర్లళ్ల తాగునీళ్లకు అవస్తలు ఉండె. ప్రజాప్రతినిధులు ఊర్లళ్లకు పోతందుకు బయపడేటోళ్లు. ఊర్లెకు పోతే మహిళలు బిందెలు పట్టుకుని ఏడ అడ్డం తిరుగుతరో అని గుబులు పడేటోళ్లు. ఇప్పుడా పరిస్థితి ఉందా..? కేసీఆర్ సీఎం అయినంక ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలె. ఇంత అభివృద్ధి చేసినా కాంగ్రెసోడు, బీజేపోడు తప్పుడు కూతలు కూస్తుండ్రు. వాళ్ల మాటలు నమ్మి మోసపోకండి. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందిగా.. ఈసారి కాంగ్రెస్కు ఇద్దాం అని ఆడొగడు, ఈడొగడు అంటున్నరట. నిన్న అన్నం తిన్నమని, ఇయ్యాల తినమా..? మంచి చేసెటోళ్లను మళ్లమళ్ల గెలిపిస్తే తప్పేంది..? అయినా గతంలో 11 సార్లు అధికారంల ఉండి ఏం చేయని కాంగ్రెసోడు ఇప్పుడు చేస్త అంటే ఎట్ల నమ్ముతరు..?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
‘కాంగ్రెసోళ్లు ఏం చెప్తున్నరు..? మూడు గంటల కరెంటు చాలు రైతులకు అని కుళ్లా మాట్లాడుతున్నరు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడే ఈ మాట అంటున్నడు. 10 హెచ్పీ మోటార్లు పెడితే పొలాలు అయ్యే పారుతయ్ అని చెప్తున్నడు. ఇట్లాంటి కాంగ్రెసోళ్లను మళ్లా గెలిపిస్తరా..? మళ్లా ఎనకటి రోజులు తెచ్చుకుంటరా..? 60 ఏండ్లు అధికారంల ఉండి ఏం జేయని సన్నాసోడు ఇప్పుడు చేస్తడా..? చేస్త అంటే నమ్ముదామా..? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..?’ అని మంత్రి ఓటర్లను ఆలోచింపజేశారు.