హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని పారిశ్రామిక సమాజాన్ని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని సంతోషం వ్యక్తంచేశారు.
రాబోయే ఐదేండ్లలో ఎస్టీ సామాజికవర్గం నుంచి ఐదు వేలకుపైగా ఆంత్రప్రెన్యూర్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలని, అందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఆ ఐదు వేల మంది ద్వారా మరో 50 వేలమందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్లోని పార్క్హయత్లో ‘చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ట్రైబ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్’ (సీఎంఎస్టీఈఐ) ద్వారా లబ్ధిపొందిన సుమారు 500 మంది పారిశ్రామికవేత్తలు సక్సెస్మీట్ను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలివి ఒకరిసొత్తు కాదని, జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడాలని, ప్రతిక్షణం తెలివితో ఆలోచించి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా పారిశ్రామికవేత్తలు బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. చింతమడక గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్.. 750 ఓట్ల తేడాతో ఓటమి పాలైనా పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయాలను అవపోసనపట్టి, ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును వివరించారు. సీఎం కేసీఆర్ తండ్రి ముంబైలో షాపూర్జీ పల్లోంజి కంపెనీలో సబ్కాంట్రాక్టర్గా పనిచేసి విజయం సాధించారని చెప్పారు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వెయ్యొద్దని, అందరిలోనూ సమానమైన తెలివితేటలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఉద్బోధించారు. సీఎంఎస్టీఈఐ ద్వారా లబ్ధిపొందిన స్టార్టప్ కంపెనీ ‘హర్లీస్’ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిందని కొనియాడారు. హరిలాల్, లీల పేర్ల నుంచి ‘హర్లీస్’ స్టార్టప్ను తెలివిగా తీర్చిదిద్దారని సురేశ్నాయక్, లక్ష్మీ దంపతులను అభినందించారు.
రాష్ట్రంలో తిరుగులేని పారిశ్రామిక సమాజం
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఎస్టీఈఐ పథకం ద్వారా 500 మంది పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో తమ ప్రతిభచూపడం ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. విజయం సాధించిన వారు ప్రభుత్వ పెద్దలను పిలిచి ఓ ఫైవ్స్టార్ హోటల్లో సక్సెస్మీట్ పెట్టి, తమ కృతజ్ఞత చూపించడం గొప్ప విషయమని అన్నారు. దళితబంధుతో ఎందరో దళిత యువకులు పారిశ్రామికవేత్తలుగా అవతరించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక భరోసాతో నెలకు రూ.60-70 వేలు సంపాదిస్తున్నారని, అదేస్థాయిలో ఎస్టీ యువత పయనించాలని ఆకాంక్షించారు. 2040 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఇండియా అవతరించనున్నదని చెప్పారు.
65 ఏండ్లు ఒక ఎత్తు.. ఈ పదేండ్లు మరో ఎత్తు
స్వతంత్ర భారతంలో తెలంగాణకు సంబంధించి 65 ఏండ్లు ఒక లెక్క.. బీఆర్ఎస్ పాలనలో ఈ పదేండ్లు మరో లెక్క అని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సమాజంలో అణగారిన అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక చేయూతనందించడం గొప్ప విషయమని కొనియాడారు. సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీగా చేశారని, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చారని, మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇచ్చారని, ఎస్టీ గురుకులాలను అప్గ్రేడ్ చేయడం వంటి ఎన్నో పనులు చేశారని వివరించారు.
సీఎం కేసీఆర్కు గిరిజన సమాజం రుణపడి ఉంటుందని, ఆయనకు కృతజ్ఞత చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలను, గిరిజన బిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే సీఎంఎస్టీఈఐ పథకమని, ముఖ్యమంత్రి సూచన మేరకు తానే డ్రాఫ్ట్ తయారు చేశానని వెల్లడించారు. రానున్న ఐదేండ్లలో వీరంతా రూ.2 వేల కోట్ల మార్కెట్ను చేరతారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ప్రముఖ పారిశ్రామికవేత్త సురేశ్నాయక్ దంపతులు, పలువురు ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.