KTR | తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి చైతన్యవంతమైన గడ్డ అన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు కాంగ్రెస్ ప్రజలు నమ్మరన్నారు. 11 సార్లు 55 ఏళ్ల పాటు అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీశారు. ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన కాంగ్రెస్ కు రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబందు, మైనార్టీ బంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను అమలు చేసిందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ పార్టీ అధికారంలోకి రాదని.. తాను గెలిచాక బీఆర్ఎస్లో చేరుతానని అసత్యపు ప్రచారం చేసుకుంటున్నాడని.. పెద్దపల్లి నియోజకవర్గ ప్రతినిధి మనోహర్రెడ్డేనని స్పష్టం చేశారు.
ఓడిపోయే పార్టీకి ఓటు వేసే అంత పిచ్చివాళ్లు పెద్దపల్లి ప్రజలు కాదని, మూడోసారి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. 50-60వేల మెజారిటీతో పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రికాక ముందు పెద్దపల్లి ఓ గ్రామ పంచాయతీ అని.. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కేంద్రమైందన్నారు. మీరు అడగకున్నా సీఎం కేసీఆర్ పెద్దపల్లిని జిల్లా చేశారన్నారు. పెద్దపల్లిని మున్సిపాలిటీగా చేసుకున్నామన్నారు. రూ.200 పెన్షన్ను రూ.2వేలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దేశంలో ఎక్కడాలేనంతగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం ఆడబిడ్డలు కష్టాలు పడ్డారని, తెలంగాణ వచ్చింక ఇంటింటికీ నల్లాల ద్వారా సీఎం కేసీఆర్ నీళ్లు అందిస్తున్నారన్నారు. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన దమ్మున్న నేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 46లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పాలనలో దొంగోని లెక్కన కరెంటు వచ్చేదని కేటీఆర్.. ఆనాడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త అని తెలిపారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే కరెంటు తీగలను పట్టుకొని చూడాలని.. అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారంటీ అనేదే లేదని.. వారంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీలు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అంత్యిక్రయలకు పోతే స్నానం చేయడానికి కరెంటు ఉండేది కాదన్నాదన్నారు. రైతులకు రూ.73వేలకోట్లు పెట్టుబడి అందించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. రైతులకు బీమా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ప్రధాని మోదీ ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నరన్నారు. కరోనా కష్టకాలంలోనూ 37వేలకోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా అంటూ ప్రశ్నించారు. మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కవని, దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. తాము ఇచ్చినట్టుగా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని.. గుజరాత్ బుద్ధి మాకు నేర్పవద్దన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారన్నారు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు. గుజరాత్కు ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా..? ప్రధానికి స్పీచ్ ఎవరు రాస్తున్నారో తెలియనది, రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం అంటూ మాటలు మాట్లాడుతన్నారని.. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ సభ్యుడేనన్నారు.
రైతులకు ఉచితాలు మంచివికావని మోదీ చెబుతున్నాడని, మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.14వేలకోట్ల రుణాలు మాఫీ చేసిండన్నారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, తెలంగాణ రైతులకు రూ.73వేలకోట్లు ఇచ్చిన పెద్దన్న కేసీఆర్ అన్నారు. హిందూ ముస్లింల మధ్య పంచాయితీ పెట్టడమే ప్రధాని మోదీకి పని అంటూ విమర్శించారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.25లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్కు ఢిల్లీ నుంచి, కర్నాటక నుంచి మస్తు పైసలు వస్తున్నయని.. రేవంత్రెడ్డి పరమదొంగ అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు డబ్బలు ఇస్తే తీసుకోవాలని.. ఓటుమాత్రం కేసీఆర్కు వేయాలని పిలుపునిచ్చారు. మోసాన్ని మోసంతోనే గెలవాలన్నారు. తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్కు రాలేదని, గత ప్రభుత్వ హయాంలో నీళ్ల కోసం ఎప్పుడూ గొడవలే జరిగేవని గుర్తు చేశారు. కరెంట్ కోసం గతంలో ఎన్నో తిప్పలు ఉండేవని, 24 గంటల కరెంట్పై కాంగ్రెస్ నేతలకు నేను సవాల్ చేస్తున్నానన్నారు. తామే బస్సులు పెడతామని. ఎక్కడికైనా వచ్చి చూసుకోవాలన్నారు.