హైదరాబాద్ : కేంద్రంలో ఉన్నది పేదల కడుపుకొట్టే ప్రభుత్వమని, అడ్డగోలుగా అడిషన్ డ్యూటీలు, సెస్లు వేసి రూ.30లక్షల కోట్లు దేశ ప్రజల మోదీ ప్రభుత్వం వసూలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. జమ్మికుంటలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో బీజేపీ పార్టీ, నేతల తీరును తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పెట్రోల్, డీజిల్ ధరలు వాయించి.. మధ్య తరగతి ప్రజలు, తమ్ముళ్లను వాయించి తోలు తీసి 30లక్షల కోట్లు మోదీ వసూలు చేశాడు.
ఇవి ఎక్కడికిపోయినయ్ అంటే.. ఇక్కడున్న బీజేపీ నేతలు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు.. రాష్ట్రం దివాళా తీసింది అని మాట్లాడుతరు. నాకు మొత్తం ఎరికే నేను ఇది వరకు ఆర్థిక మంత్రిగా పని చేసిన అని రాజేందర్ అంటున్నరు. రాజేందర్కు నియ్యతి ఉంటే.. ఇమానం ఉంటే.. దమ్ముంటే నీ నరేంద్ర మోదీ ఆయన కంటే 14 మంది ప్రధానులు పని చేశారు. వారంతా చేసిన అప్పు భారత్పై 56లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు 100లక్షల కోట్లు కాదా? అని చెప్పాలని ఈటల రాజేందర్ను అడుగుతున్న. 100లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకు నీతులు చెప్పుతుండు.. ఈ 100లక్షలకోట్లు, 30లక్షల కోట్లు వసూలు చేశారు ఎక్కడపోయినయ్’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతడు.. మేం జాతీయ రహదారులు వేస్తలేమా? అంటున్నడు.. కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్కు వెళ్తే.. మరో జాతీయ రహదారిపై వెళ్లే టోల్ వసూల్ చేయడం లేదా? మన పైసలతో వేసిన రోడ్లకు.. మళ్లీ కవరింగ్. ఎయిర్పోర్టులు మీరు కట్టేదేముంది? రాష్ట్ర ప్రభుత్వం జాగ ఇస్తది. ప్రైవేటు వాళ్లు కట్టిస్తరు.. పర్మిషన్ ఇస్తవ్ కట్టేదేముంది. బండి సంజయ్ ఇంకా ముర్ఖంగా మాట్లాడుతడు. ఆయనను కరీంనగర్ ఎంపీగా ఎందుకు గెలిపించినం. నాలుగు పాఠశాలలు తీసుకురా.. పనులు చేయి.. కాలేజీలు తీసుకురా.. జమ్మికుంట చేనేత కార్మికులకు సహాయం చేయమంటే దేవుడు మోదీ అంటున్నడు.
జమ్మికుంట, కమలాపూర్లో ఉండే చేనేతలు, పద్మశాలీలు ఆలోచించాలి. ఇంతకు ముందు 14 మంది ప్రధానమంత్రులు చేనేతపై పన్ను వేయలేదు. మొట్టమొదటిసారిగా దుర్మార్గపు ప్రధాని నరేంద్ర మోదీ పద్మశాలీలు, చేనేతపై ఐదుశాతం జీఎస్టీ విధించారు. గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానం పంపిస్తే ఆమోదం తెలుపకుండా, గిరిజన రిజర్వేషన్ ఇవ్వడం లేదు మరి ఎవరికి దేవుడు. 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్, సిలిండర్ ధరలు. ఆకాశంలో అప్పులు, పాతాళంలో రూపాయి ఇందుకేనా మోదీ దేవుడు? అమిత్షాను టచ్ చేయబుద్ధి అయితుందంటడు. ఇందుకేనా నిన్ను ఎంపీని చేసింది’ అంటూ మండిపడ్డారు.
‘తెల్లవారితే లేస్తే మసీదులు తవ్వుదాం.. శవం ఎల్లితే మీది.. శివం ఎల్లితే మాది అంటున్నడు ఇందుకేనా ఎంపీని చేసింది. హుజూరాబాద్లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం దమ్ముంటే రా. పరిశ్రమలు పెట్టేందుకు కావాలంటే పునాదులు తవ్వుదాం దా.. డబుల్ ఇండ్ల కోసం తవ్వుదాం దమ్ముంటే మోదీని ఒప్పించి పైసలు తీసుకొని రా.. ఇవేవి చేతకావు.. గట్టి మాట్లాడితే మెమ్మెమే.. బెబ్బెబే.. హిందుస్థాన్.. పాకిస్తాన్.. హిందూ, ముస్లిం ఇంకా ఏమి చేతకాదు’ అంటూ విమర్శలు గుప్పించారు.