హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు. మహిళా దినోత్సవం (Women’s day) సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ (Municipal department) అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నది. పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
వారం పాటు నిర్వహించే ఈ మహిళ వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు పురపాలికల్లో ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలికల సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు. దీంతోపాటు పట్టణాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకుల నుంచి మొదలుకొని మహిళా వ్యాపారవేత్తల వరకు వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహిళా రక్షణ, మహిళ ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారికత వంటి అంశాల పైన ప్రత్యేక సమావేశాలు చర్చాగోష్టులను నిర్వహించి మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీంతోపాటు ఈ వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. వారం పాటు జరిగే ఈ సంబరాలకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. మార్చి 8 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలన్నింటిని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవాలని, ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.