వరంగల్: నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ టెక్స్టైల్ పార్కని చెప్పారు. వరంగల్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. వరంగల్లోని (Warangal) శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటుచేసే కంపెనీల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. యంగ్వన్ కంపెనీతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దేశంలో వ్యవసాయం, టెక్స్టైల్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువని వెల్లడించారు.
వరంగల్ జిల్లాలో నంబర్ వన్ పత్తి పండుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో టెక్స్టైల్ పార్కు ఉండబోతున్నదని చెప్పారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెస్తామన్నారు. ఇప్పటికే గణేశా కంపెనీ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. యంగ్ వన్ కంపెనీ మొత్తం 11 పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనిద్వారా వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు. వరంగల్ జిల్లాలో వచ్చే మూడు కంపెనీల వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ పరకాలగా మారుతుందని చెప్పారు. వరంగల్లో తయారయ్యే దుస్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు.
పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మోడల్గా మారిందని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు కేంద్రానికి మార్గదర్శకం అయ్యాయని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. దేశంలోని మున్సిపల్, పంచాయతీ అవార్డుల్లో 30 శాతం మనవేనని చెప్పారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 33 శాతం అవార్డులు వస్తున్నాయన్నారు.
భివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతున్నదని చెప్పారు. ఐదేండ్లు మీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు మీరు మాకు అండగా ఉండాలన్నారు. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీచేయాలంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, నియోజకవర్గాలు మార్చుకుని మరీ వేరేచోటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నాని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని స్పష్టం చేశారు.
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని యంగ్ వన్ కంపెనీ చైర్మన్ చాంగ్ జాయ్ బొక్ అన్నారు. వరంగల్లో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. యంగ్ వన్ కంపెనీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. కొంతమంది మూర్ఖులు టెక్స్టైల్ పార్కుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాకతీయ మెగా టెక్స్లై పార్కు ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ అవుతుందన్నారు. వరంగల్ ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు.