Minister KTR | రంగారెడ్డి : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది.. చంటి బిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏదో రకంగా ఆసరా అందుతోంది. ప్రతి రంగాన్ని కూడా కేసీఆర్ సునిశితంగా గమనిస్తూ, మంత్రులకు సూచనలు ఇస్తూ.. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి( MLA Kishan Reddy ) కుమారుడు ప్రశాంత్ రెడ్డి 63 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. 95 గ్రామాల మీదుగా.. 775 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్పేట్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్( BRS ) ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాదయాత్ర ద్వారా ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లిన ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధి కావాలనే నాయకుడు ప్రజలకు ఆశయాలకు, ఆలోచనలకు ప్రతినిధిగా ఉండాలి. నాలుగు ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత టర్మ్ అయిపోగానే దిగిపోయే నాయకుడు ప్రజాప్రతినిధి కాడు. ప్రజాజీవితంతో ముడిపడి ఉన్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి అని కేటీఆర్ కొనియాడారు.
కేసీఆర్ నాయకత్వంలో పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చెందాయని కేటీఆర్ తెలిపారు. భారతదేశానికి పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ చేరింది. అత్యుత్తమ గ్రామపంచాయతీలు, అత్యుత్తమ మున్సిపాలిటీలు మన దగ్గరే ఉన్నాయని కేంద్రం చెప్పింది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 24 వేలు.. 2023 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేలకు చేరింది. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని దుష్ర్పచారం చేశారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలోని కొంగరకలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్ కాన్ వారు కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు. మే నెలలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. ఈ పరిశ్రమ వల్ల లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయి.. ప్రజల సంపద, రాష్ట్ర సంపద పెరిగింది కాబట్టే పేదలకు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. రైతు బంధు అమలు చేస్తున్నాం. పంటలు వేసే కాలంలో ఎకరాకు రూ. 5 వేల చొప్పున సాయం అందజేస్తున్నాం. రైతుబంధు కింద రూ. 65 వేల కోట్లు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబీమా కల్పిస్తున్నాం. పుట్టిన బిడ్డకు ఆరోగ్యలక్ష్మి, పెళ్లి చేసుకునేవారికి కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నాం… గృహలక్ష్మి పథకం కింద మహిళల పేరు మీద రూ. 3 లక్షల చొప్పున అందించబోతున్నాం. ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. అందర్నీ కడుపులో పెట్టుకుని చూస్తున్నాం. మంచినీరు, రహదారులు, కరెంట్ సమస్య పరిష్కరిమైంది అని కేటీఆర్ తెలిపారు.