Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని, అందుకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్రగతి నివేదన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయ భవనం, ఆడిటోరియం, డంపింగ్ యార్డ్ లతో పాటు సి సి రోడ్లు, డ్రైనేజీలు,ఇంటిగ్రేటెడ్ వెజ్- నాన్ వెజ్ మార్కెట్ , బతుకమ్మ ఘాట్, కమ్యూనిటీ హల్,సెంట్రల్ లైటింగ్.. వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. తుంగతుర్తిలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే, నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)తో 36,4891 ఆయకట్టు ఉన్న తుంగతుర్తిలో లక్షన్నర ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నియోజకవర్గంలో 49,130 మందికి ఆసరా పెన్షన్లు(Aasara Pensions) ఇస్తున్నామని, దళిత బంధు(Dalit Bandhu) ద్వారా 2,300 మందికి ఆర్థిక చేయూత అందించామని కేటీఆర్ తెలిపారు.
జిల్లాలో ఫ్లోరైడ్ తో ప్రజలు జీవచ్చవాల్లా మారిపోతే కాంగ్రెస్ నాయకులు చేతులు ముడుచుకొని కూర్చున్నారని, అలాంటి వాళ్ళను ఎలా నమ్మాలని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు పచ్చి మోసగాళ్ళుని, తెలంగాణ ప్రజలను 50 ఏళ్ళు అరి గోస పెట్టారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్(MLA Gadari Kishore) కోరినట్లుగా తిరుమల గిరి, మోత్కూర్(Mothkur) మున్సిపాలిటీలకు రూ. 100 కోట్లు విడుదల చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గాదరి కిషోర్ను 40 వేల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.