KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని కేటీఆర్ తెలిపారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
టీఎస్ ఐపాస్, టీఎస్ బీ పాస్ మీకు తెలుసు. ఈ రెండింటి ద్వారా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. కొత్త మున్సిపాలిటీ, కొత్త పంచాయతీ చట్టాలను తెచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 24 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి తదితర కంపెనీలకు నిలయంగా మారింది. ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 2.41 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ ఉద్యోగాలు 3 లక్షల నుంచి 9 లక్షలకు చేరాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలైన వనపర్తి, నల్లగొండ, మహబూబ్నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ వంటి పట్టణాలల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పాం. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.