హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యార్థి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఐటీ మినిస్టర్ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ తన జీవితంలో ఎలా పైకి వచ్చారు.. రాజకీయంగా ఎలా ఎదిగారు అనే విషయాలను కేటీఆర్ విడమరిచి చెప్పారు.
కండ్లకోయలో ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ 68 ఏండ్ల కిందట చింతమడకలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కేసీఆర్కు 9 మంది అక్కాచెల్లెళ్లు ఒక అన్న. మా తాత పెద్ద వ్యవసాయదారుడు. ఐదారు వందల ఎకరాలు కలిగిన వ్యక్తి. రాజకీయంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ సిద్దిపేటలో చదివారు. పీజీ కోసం హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు హైదరాబాద్కు వచ్చి ఆయనను కలిశారు. మీ నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు. 9 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లి చేయాలి కదా.. ఇంటికి వెళ్లొచ్చు కదా. టీచర్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పాడు. నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు. రాజకీయంగా లేదా పబ్లిక్ లైప్లో ఉండదల్చుకున్నాను అని కేసీఆర్ తన మేనమాకు చెప్పాడు.
చేతకాని వారంతా ఇదే మాట్లాడుతారు. కలల ప్రపంచంలో బతుకొద్దు. ఒక టీచర్ ఉద్యోగం ఇప్పిస్తా.. రా అని చెప్పిండు. అయినా కేసీఆర్ వినలేదు. 22 ఏండ్ల వయసులో.. కేసీఆర్ అన్న మాట.. నేను ఎక్కువ చెప్పట్లేదు. నా ఉనికిలో నీ నీడ చూసుకునే రోజు వస్తదని మేనమామతో కేసీఆర్ చెప్పాడు. మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మస్థైర్యం ఉండాలి. ఇది కేసీఆర్కు జరిగిన మొదటి అనుభవం. ఒక మనిషి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదర్కోవాల్సి వస్తుంది. అలా కేసీఆర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.