హైదరాబాద్: వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మెట్రోలకే నిధులు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటీ 20 లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్కు నిధులు ఇవ్వడానికి కేంద్రానికి శత్రుదేశంపై పగబట్టినట్లుగా కేంద్రం తెలంగాణపై కక్షగట్టిందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్ఎన్డీపీ, మెట్రో రైలు, చార్మినార్ పాదబాట అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించామన్నారు.
అమీర్పేట మెట్రో స్టేషన్ ఎంత కిక్కిరిసిపోతుందో అందరికీ తెలుసన్నారు. 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని వెల్లడించారు. మెట్రో ధరలు ఇష్టంవచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని చెప్పారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని వెల్లడించారు. రూ.6250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసన్న మంత్రి.. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు. ఎన్ని అధునాతన భవంతులు వెలసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదన్నారు. గుల్జార్హౌస్, మీర్-ఆలం-మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. మదీనా నుంచి పత్తర్గట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయన్నారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని తెలిపారు. చార్మినార్ నుంచి దార్-ఉల్-ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. హుస్సేనీ ఆలం నుంచి దూద్బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. హెరిటేజ్ భవంతుల పూర్వవైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశామన్నారు. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశామన్నారు. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాలపై 28 వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. స్ట్రటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) దేశంలో ఏ నగరంలోనూ లేదని వెల్లడించారు. ఎస్ఎన్డీపీ ఫేజ్-2కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కొన్ని పూర్తికావడంతో.. ఎల్బీనగర్లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని స్పష్టం చేశారు.