KTR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ఎన్నికలన్నీ ఏకపక్షమే అని.. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ భారీ విజయం సాధించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత రెండు ఎన్నికల్లో నిండు మనసుతో ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించారు.. ముచ్చటగా మూడోసారి కూడా ఆశీర్వదిస్తారని, మనదే విజయం అని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్. డిసెంబర్ మూడో తేదీన ముచ్చటగా, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు దక్షిణ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాయని, దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం కట్టబోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హ్యాక్టరీ విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు కావడం ఖాయమన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతోందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప.. ఈ గడ్డపై గాడ్సే రాద్ధాంతం నడవదు అని తేల్చిచెప్పారు. 2014లో ఉద్యమ చైతన్యంతో, 2018లో సంక్షేమ సంబురంతో గెలిచాం. 2023లో మూడో ఎన్నికను శాసించేది.. ముమ్మాటికీ మన పదేండ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధంగా ఉందని, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం తీసుకుందని, పోటీకి ముందే పూర్తిగా కమలం కాడి పడేసిందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తన పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం.. ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం.. అఖండ విజయం మనదే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!
భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..!రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!
మూడోసారి మనదే జయం..!డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో
ముచ్చటగా మూడోసారి గెలిచేది
మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..!దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం
దక్షత గల…— KTR (@KTRBRS) October 9, 2023