KTR | రంగారెడ్డి : విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే పాడి రైతులకు ఇప్పటి వరకు రూ. 350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల వద్ద దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన విజయ మెగా డెయిరీని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మెగా డెయిరీని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్లతో నిర్మించారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాడి రైతులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. భారతదేశంలోనే అతి పెద్దదైన మెగా డెయిరీని మన రాష్ట్రంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. రికార్డు సమయంలో 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం అభినందనీయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
వ్యవసాయదారులు, రైతులు వ్యవసాయం మీద, పంటల ఉత్పత్తి మీద కాకుండా పాడి మీద కూడా ఆధారపడుతారని కేటీఆర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంట్లో ఒకటో రెండు బర్రెలు, ఆవులు ఉంటాయి. ఆ కల్చర్ తరతరాలుగా ఉంది. గత ప్రభుత్వాలు విజయ డెయిరీని ప్రోత్సాహించలేదు. పాలు పోసే రైతులను గత ప్రభుత్వాలు ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచారు. నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మన కేసీఆర్ నాయకత్వంలో పాడి రైతులకు రూ. 4 ఇన్సెంటివ్ ఇవ్వడం ప్రారంభమైన తర్వాత లక్షన్నర లీటర్ల నుంచి 4 లక్షల పైచిలుకు లీటర్లు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. భవిష్యత్లో విజయ డెయిరీ మరింత విస్తృతమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇన్సెంటివ్ రూపంలో పాడి రైతులకు ఇప్పటి వరకు రూ. 350 కోట్ల ప్రోత్సహకాలు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. మిగతా బాకీ కూడా త్వరలోనే ఇస్తాం. ఆందోళన అవసరం లేదు. ఇందులో రైతులు కూడా ఉన్నారు. ఇప్పటికే రుణమాఫీ కోసం రూ. 21 వేల కోట్లు ఇచ్చాం. రైతుబంధు కింద రూ. 73 వేల కోట్లు ఇచ్చాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. రూ. 1500 కోట్లు ఖర్చు పెడుతూ రైతుబీమా ఇస్తున్నాం. పాల రైతులకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇలా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ పదేండ్లలో తెలంగాణ ప్రతి రంగంలో పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశానికే దారి చూపే విధంగా ముందుకు పోతున్నాం. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది.. అమ్మేస్తోంది. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకున్నాం. విజయ డెయిరీ నష్టాల్లో ఉంటే లాభాల బాటలోకి తీసుకెళ్లాం. పాడి రైతులకు అండగా నిలబడ్డాం. మీకు ప్రోత్సహకాలు ఇవ్వడం వల్ల విజయ డెయిరీ కూడా లాభాల బాట పట్టింది. గవర్నమెంట్కు డివిడెంట్ ఇచ్చే స్థాయికి విజయ డెయిరీ వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.