హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ‘వెల్డన్ కిషన్ అన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి భారీ ప్రాజెక్టును తీసుకొచ్చారు..’ అంటూ కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. సీతాఫల్మండి రైల్వే స్టేషన్లో మూడు ప్యాసింజర్ లిఫ్టులను కిషన్రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయడంపై కేటీఆర్ ఈ సెటైరిక్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకురావడంలో బీజేపీ ఎంపీ అతిపెద్ద లక్ష్యాన్ని
సాధించారని వ్యంగ్యంగా ప్రశంసించారు.
గతంలో కరోనా సమయంలో అన్నార్తులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుర్కురేలను పంపిణీ చేసి విమర్శల పాలయ్యారు. తాజాగా సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్లను జాతికి అంకితం చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మంత్రిని ఆడుకున్నారు. లిఫ్టులను జాతికి అంకితం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకం ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కేంద్రమంత్రి తీరుపై జోకులు పేల్చుతూ ట్రోల్ చేశారు నెటిజన్లు. ‘మా సికింద్రాబాద్ ఎంపీ.. మూడు లిఫ్టులు.. ఆరు కుర్కురే ప్యాకెట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు..’ అని కొందరు ఎద్దేవా చేయగా.. ‘తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తే.. బీజేపీ కేంద్రమంత్రి మాత్రం ప్యాసింజర్ లిఫ్ట్లను జాతికి అంకితం చేస్తున్నారు..’ అని మరికొందరు వ్యంగ్య బాణాలు సంధించారు. ‘కిషన్రెడ్డి కనీసం లిఫ్ట్లనైనా ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్ బీజేపీ ఎంపీలు వాటిని కూడా ప్రారంభించడం లేదు..’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. కిషన్రెడ్డిని లిఫ్టుల శాఖ మంత్రిగా మరొకరు సంబోధించారు. ‘నిన్న కుర్కురేలు.. నేడు లిఫ్టులు.. మున్ముందు జాతికి ఏం అంకితం చేయబోతున్నారు సార్. ఇలాంటి గొప్ప వ్యక్తి రుణం తెలంగాణ ఏమిచ్చి తీర్చుకుంటుంది’ అంటూ కొందరు హాస్యపూరితంగా విమర్శించారు.
కొత్త పార్లమెంట్కు అంబేద్కర్ పేరు సముచితం: కేటీఆర్
నూతన పార్లమెంట్ భవనానికి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం సముచితమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానంపై ఎన్డీఏ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రైలులో గర్భిణికి ప్రసవం చేసిన మెడికల్ విద్యార్థినిని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో అభినందించారు.