KTR | ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ డబ్బులు చాలా మందికి ఉండవచ్చు కానీ.. మంచి చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమన్నారు.
మోహన్రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమంటూ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిందని, 6లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి, పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తమకు ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ మనదేనన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు అంతేలా ఉంటాయన్నారు. అందరూ స్కిల్ సంపాదించాలని సూచించారు. గతంలో పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన దుస్థితి వాస్తవం కాదా? అని గుర్తు చేసిన కేటీఆర్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు.
ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్ అని, ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్గా తయారైందన్నారు. హైదరాబాద్ మారింది వాస్తవం కాదా? 24 గంటల కరెంటు ఉండడం వాస్తవం కాదా..? ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావడం.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతంగా ఉన్న ప్రసూతి.. ఇప్పుడు 60శాతానికి వచ్చిన మాట వాస్తవం కాదా? అన్నారు. రియల్ ఎస్టేట్ అప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎకరా ఎంత ఉందో తెల్వదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కేవలం స్కిల్ డెవలప్మెంట్పైనే దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.