రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు. వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తాం. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లను నిర్మించాలి. మూలవాగుకు అనుకుని ఉన్న బండ్ను సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్గా మారుస్తామన్నారు. నృత్య, సంగీత పాఠశాలలకు ప్రత్యేక భవనాలు నిర్మిస్తామన్నారు. వేములవాడలో త్వరలోనే మినీ స్టేడియం పనులు పూర్తవుతాయన్నారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తామన్నారు. నాంపల్లి గుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.