హైదరాబాద్ : స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాలకు సంబంధించిన విషయంలో నాలా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఆ తర్వాత ఎక్కడెక్కడ నాలాలను బలోపేతం, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందో గుర్తించి.. సంబంధిత పనులు పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిసారి అనేక చర్యలు తీసుకుంటున్నా.. దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఈ సారి అలాంటి సంఘటను జరుగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాలాలకు ఫెన్సింగ్ వేయడంతో పాటు ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ సారి సరిపడా సమయం ఉందని, ఈ నేపథ్యంలో సంబంధిత పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఒక వేళ భవిష్యత్లో నాలాలపైన దురదృష్టకర సంఘటనలు, ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులను ఇందుకు బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు.
జోనల్ కమిషనర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ నాలాలపై ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. నాలాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ప్రతివారం సమీక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్కు మంత్రి సూచించారు. మేయర్ నగరవ్యాప్తంగా పర్యటించి కార్యక్రమ పనులను పర్యవేక్షించాలని సూచించారు.
కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని కాకుండా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పురపాలికల్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సీడీఎంఏ సత్యనారాయణను కేటీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి మేజర్ కార్పొరేషన్లలోనూ నాలాల వద్ద రక్షణ చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు.