హైదరాబాద్ : కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక ఉన్న వాస్తవాలను మేధావులు, రాజకీయ నాయకులు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే నిన్నటి తగ్గింపుతో రాష్ట్రాలకు రావాల్సిన రాబడి పోయిందని.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసలు వెల్లడించలేదని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్ను ఏమాత్రం తగ్గించలేదని మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ‘స్పీన్ డాక్టర్ నిర్మలా సీతారామన్.. మీకు చెప్పని విషయం ఏంటంటే.. ఇంధన ఎక్సైజ్ డ్యూటీపై 42శాతం వాటా రాష్ట్రాలది. నిన్నటి కోతలతో రాష్ట్రాలు పెట్రోల్పై రూ.2.52, డీజిల్పై రూ.3.36 రాబడిని కోల్పోతున్నాయి. ఆర్థిక మంత్రి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్ను తాకకుండా వదిలేశారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య’ అని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్ను మన్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.