Minister KTR | అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర్వాహకుల నుంచి కేటీఆర్కు ఇన్విటేషన్ వచ్చింది. ఈ సమావేశంలో యూరప్, ఆసియాలకు చెందిన 100 మంది అత్యంత ప్రభావశీలమైన నాయకులు పాల్గొంటారు.
అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ అసందిగ్ధత, యూరప్-ఆసియా కారిడార్లో సేవలందిస్తున్న బడా కంపెనీలపై దీని ప్రభావంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ‘‘గౌరవప్రదమైన, శక్తిమంతమైన మీ వంటి నాయకుల మధ్య ఆలోచనాత్మక, అర్థవంతమైన చర్చ జరిగేలా చూడటమే మా లక్ష్యం. ఈ కారణం వల్లనే కనీసం ఒక బిలియన్ డాలర్ల రెవెన్యూ కలిగిన కంపెనీల బోర్డు మెంబర్లను కూడా సమావేశానికి ఆహ్వానించాం’’ అని ఇన్విటేషన్లో నిర్వాహకులు పేర్కొన్నారు.
అక్టోబర్ 4న జరిగే ఈ సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6 మాజీ చీఫ్ సర్ జాన్ స్కార్లెట్, ఎల్డీసీ గ్రూప్ చైర్మన్ మార్గరిటా లూయిస్ డ్రూఫస్, గోల్డ్మాన్ శాచ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ మాజీ చైర్మన్ లార్డ్ జిమ్ ఓనీల్, విడాకైక్సా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ జోర్డి గాల్, బ్యాంక్ ఆఫ్ చైనా యూకే బోర్డ్ మెంబర్ డాక్టర్ గెరార్డ్ లియాన్స్, హెచ్ఎస్బీసీ మాజీ సీఈవో, చైర్మన్ లార్డ్ స్టీఫెన్ గ్రీన్ వంటి మహామహులు పాల్గొంటారు. ఇటువంటి ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి తనను ఆహ్వానించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నాయకులంతా కలిసి వివిధ అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక అని కొనియాడారు.