న్యూఢిల్లీ, జూలై 8 : ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గం నుండి నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురీ, పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రలను తప్పించవచ్చని వారు చెప్పారు.
మొదటి కారణం క్యాబినెట్లోకి యువరక్తాన్ని తీసుకురావడం. మంత్రుల సగటు వయసును బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వయసు 46 ఏండ్లకు దగ్గరగా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రెండు నుంచి నాలుగేండ్ల వయసు వ్యత్యాసం ఉండవచ్చేమో కాని కొన్ని మినహాయింపులు తప్పించి 65 సంవత్సరాలు పైబడిన మంత్రులను తొలగించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన ప్రధాని మోదీకి మాత్రం వర్తించదని వర్గాలు తెలిపాయి. గడిచిన రెండు పునర్వ్యవస్థీకరణల్లో మంత్రిత్వశాఖలు మారని మంత్రులకు ఈసారి శాఖల మార్పు తప్పకపోవచ్చని వారు చెప్పారు. ఇక రెండవ కారణం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన బాధ్యత బీజేపీకి ఉండడం. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని వీడిన పంజాబ్కు చెందిన రాజ్యసభ సభ్యులు, శివసేన(ఉద్ధవ్ వర్గం)పై తిరుగుబాటు చేసిన పార్టీ ఎంపీలు, పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఉన్నారు.
పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పురీని క్యాబినెట్ నుంచి తప్పించి వేరే బాధ్యతలను అప్పగిస్తారా అన్న విషయంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరగలేదని వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన నిష్క్రమణ అనివార్యమని వారు చెప్పారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను తప్పించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆమెకు దక్షిణ భారతంలో ఒక పెద్ద సంస్థాగత పాత్ర ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2029 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం కొత్త ఆర్థిక చర్యలు చేపట్టాలని యోచిస్తున్నది. అలాగే వాటిని ప్రజల ముందు ఉంచడానికి ఒక కొత్త ముఖాన్ని కోరుకుంటున్నది. ఆమె పనితీరు పట్ల ఎటువంటి అసంతృప్తి లేదని, మోదీ-షా కీలక బృందంలో ఆమె భాగస్వామిగా కొనసాగుతారని వర్గాలు చెప్పాయి.
ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత దాస్ మంత్రి పదవుల రేసులో ముందంజలో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పియూష్ గోయల్ను ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ వివాదంలో చిక్కుకున్న ధర్మేంద్ర ప్రధాన్ను విద్యా శాఖ నుంచి తప్పించే అవకాశం లేదని వారు చెప్పారు. అయితే ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఆయన కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పుకొనే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పంకజ్ చౌదరిని ఒక వ్యక్తికి ఒక పదవి అన్న విధానం కింద క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. కేంద్ర సహాయ మంత్రిగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హర్ష్ మల్హోత్రను తప్పించే అవకాశం ఉంది.
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్కు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. దక్షిణాది నుంచి విశాఖపట్నం ఎంపీ డీ పురందేశ్వరికి టీఎంసీ తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్కు అవకాశం రావొచ్చు.