పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ వచ్చే నెల నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించింది. ఇప్పటికే గణేశా ఎకోస్పేర్ వస్ర్తోత్పత్తిని ప్రారంభించగా, దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్ యూనిట్కు మంత్రి కేటీఆర్ ఇటీవల శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు (కేఎంపీటీ) సమీప భవిష్యత్తులోనే అంతర్జాతీయ ఉత్పత్తుల కేంద్రంగా ప్రఖ్యాతి గాంచనున్నది. ఇందులో ఏర్పా టు చేసిన చిన్న పిల్లల దుస్తుల తయారీ ప్రపంచ దిగ్గజ సంస్థ కిటెక్స్ త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నది. షెడ్ల నిర్మాణంతోపాటు మిషన్ల ఏర్పాటు పూర్తికావడంతో కంపెనీలో ట్రయల్ రన్ నిర్వహించారు. వచ్చే నెలలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే గణేశా ఎకోస్పేర్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించింది. తాజాగా దక్షిణ కొరియా దుస్తుల తయారీ దిగ్గజం యంగ్వన్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కిటెక్స్, యంగ్వన్ ఉత్పత్తిని ప్రారంభిస్తే ఇక అతి త్వరలోనే అగ్రరాజ్యం అమెరికాతోపాటు విదేశాలకు తెలంగాణ నుంచి బట్టలు ఎగుమతి కానున్నాయి. లక్షమందికిపైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
కేఎంటీపీలో ఉపాధి జాతర
కిటెక్స్ రాష్ట్రంలో రూ. 3వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్న విషయం తెలిసిందే. నిరుడు మే నెలలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా కేఎంటీపీలో పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మొదలు వరంగల్లోని కేఎంటీపీలో రూ.వెయ్యి కోట్లు, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో రూ.1400 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకొన్న కిటెక్స్ సంస్థ.. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ స్నేహపూర్వక వైఖరి, ఇక్కడి భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్లోని కేఎంటీపీలో మరో రూ.600 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.600 కోట్లతో పిల్లల సాక్స్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో కిటెక్స్ ఏర్పాటు చేస్తున్న దుస్తుల తయారీ పరిశ్రమల్లో 28వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో 80 శాతం మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇప్పటికే కేఎంటీపీలో మొదటి దశ ఉత్పత్తికి ట్రయల్ రన్ చేపట్టిన సంస్థ, వచ్చే నెలలో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించింది. సీతారాంపూర్ పరిశ్రమ నిర్మాణ పనులు చురుకుగా సాగుతుండగా, ప్రారంభానికి మరో ఏడాది పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మొత్తం పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తే రోజుకు 2.5 మిలియన్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. కిటెక్స్ తయారు చేయనున్న దుస్తుల్లో దాదాపు 90 శాతం అమెరికాకు ఎగుమతి కానున్నాయి. సమీప భవిష్యత్తులో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనుండడంతో మహిళలకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే రెండు వేలమంది మహిళలు శిక్షణ తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు.
కేఎంటీపీ విశేషాలు
పరిశ్రమలకు అడ్డా
కేఎంటీపీ క్రమంగా అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా మారుతున్నది. ఇందులో ఇప్పటికే మన దేశానికి చెందిన గణేశా ఎకోస్పేర్ సంస్థ రూ.550 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్ ద్వారా వివిధ ఉత్పత్తులను తయారుచేస్తున్నది. ట్రాక్సూట్లు, చలికాలంలో ధరించే దుస్తులను ఉత్పత్తి చేస్తున్నది. దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్కు ఇటీవల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ కేఎంటీపీలో మొత్తం 11 ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నది. ఇందులో మొదటి దశలో నాలుగు, అనంతరం దశలవారీగా మిగిలిన ఏడు ఏర్పాటుచేయనున్నది. మొత్తం 21 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక్కడినుంచే అమెరికా, యూరప్ దేశాలకు దుస్తులు ఎగుమతి కానున్నాయి. ఇవన్నీ ఉత్పత్తులు ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రం వస్ర్తాల ఎగుమతి కేంద్రంగా మారనున్నది.