హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): 8 ఏండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీకి, ఇప్పటి పాతబస్తీకి తేడా గమనించాలని, స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో పాతబస్తీ ప్రగతికి ప్రాధాన్యం ఇస్తున్నామని, గడిచిన 8 ఏండ్లలో చక్కటి ప్రగతిని సాధించిందని అన్నారు. ఓల్డ్సిటీ అభివృద్ధిపై మంగళవారం హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. పాతబస్తీలో నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతున్నదని తెలిపారు. జలమండలి ద్వారా మురుగునీటి వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతామని హామీఇచ్చారు. 8 ఏండ్లలో పాతనగరంలో తాగునీటి సరఫరా మెరుగు పడిందని, ఇందుకోసం సుమారు రూ.1,200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వివరించారు. కొత్తనగరంతోపాటు పాతనగరంలోనూ విద్యుత్తు సరఫరా వ్యవస్థ మెరుగైందని అన్నారు. మీరాలం ట్యాంక్ పైనుంచి 6 లేన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ దశలో ఉన్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిలో పాతబస్తీ ప్రగతికి ప్రాధాన్యం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్తోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.