సిరిసిల్ల : మెగా పవర్లూం క్లస్టర్ను మంజూరు చేయించాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కష్టకాలంలో అవసరమైతే కావాల్సిన సిబ్బందిని నియమించుకునేందుకు వెసులుబాటును స్థానిక అధికారులకు కల్పించామన్నారు.
వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో సిరిసిల్ల ఐదోస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 479 వైద్యబృందాలు 1.50లక్షల ఇండ్ల వద్దకు వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జిల్లా హెల్త్ ప్రొఫైల్ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మొదటి విడుత దళితబంధు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ‘మనఊరు – మనబడి’లో భాగంగా 510 పాఠశాలలను మూడు సంవత్సరాల్లో ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కేంద్రం ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయా బడ్జెట్లలో నేతన్నలను ఇక్కడి నేతన్నలను పట్టించుకున్నది ఏమీ లేదన్నారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు కేంద్రంతో రూ.897కోట్లు మంజూరు చేయించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసే బాధ్యత సంజయ్దేనన్నారు.
లూమ్ అప్గ్రేడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలని, టెక్స్లైట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 11 చేనేత క్లస్టర్లను మంజూరు చేయించాలని, మెగా పవర్లూం క్లస్టర్ను మంజూరు చేయించాలని బండిని డిమాండ్ చేశారు. కేంద్రం మంజూరు చేయకుంటే రాష్ట్రంలోని నేతన్నలను ఏకం చేసి.. పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.