KTR | కామారెడ్డి : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పైసల కోసమో, పదవుల కోసమో సురేందర్ ప్రజా జీవితంలోకి రాలేదు. తెలంగాణ రావాలని కేసీఆర్తో కలిసి నడిచిండు. సురేందర్ను ఈసారి 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. అభివృద్ధి మరింత చేస్తున్నాం. శాశ్వతమైన ఎమ్మెల్యేగా సురేందర్ రెడ్డిని చేసుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
2018లో రాష్ట్రం మొత్తంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే.. అత్యధిక మెజార్టీతో సురేందర్ గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల వల్ల నేను గెలువలేదని సురేందర్ చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజల దయతోనే గెలిచాను అని ఆయన చెప్పినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పాటు పడుతున్నానని సురేందర్ తెలిపారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పథంలో బ్రహ్మాండంగా ముందుకు పోతోందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ను, మంత్రులను సురేందర్ ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గం వెనుకబడింది.. నిధులు కేటాయించాలని అడుగుతారని కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 20 కోట్ల 31లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,03,348 మంది రైతులకు రైతుబంధు అందుతున్నదని పేర్కొన్నారు.
2001 నుంచి కేసీఆర్కు తమ్ముడిలా సురేందర్ 119 నియోజకవర్గాల్లో వెన్నంటి నడిచారని కేటీఆర్ పేర్కొన్నారు. నాడు మూడు పెద్ద శక్తులను తట్టుకొని కేసీఆర్ పార్టీని స్థాపించారు. కేసీఆర్కు మనీ పవర్ లేదు. మజిల్ పవర్ లేదు. మీడియా బలం లేదు. ఇతర హంగులు లేవు. సినిమా యాక్టర్ కాదు. డబ్బు లేదు. ఆయన ఎత్తుకున్న అంశంలో కేవలం నిజాయితీ మాత్రమే ఉన్నది. ఆయన మాటల్లో నిప్పులు ఉన్నాయి కాబట్టి ఆనాడు తెలంగాణ మొత్తం అగ్గిలా మండింది. రాష్ట్రం ఏర్పడింది. 2001లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో 12 మండలాలకు గానూ 10 మండలాల్లో టీఆర్ఎస్ను గెలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.