హైదరాబాద్ : చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సాయి కిరణ్ అనే ఓ నెటిజన్.. వారిని ఆదుకోవాలంటూ కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ ముగ్గురికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆ ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, చొప్పదండి ఎమ్మెల్యేకు కేటీఆర్ సూచించారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్కు ఎమ్మెల్యే రవి శంకర్ తక్షణమే స్పందించారు. మల్యాల మండలం ఓగుళాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో చనిపోయారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్షర, సాహిత్య, హర్షవర్ధన్ ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు.
మంత్రి కేటీఆర్ సూచనలతో ఎమ్మెల్యే రవిశంకర్.. గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మధుసూదనారావు, జిల్లా కో అప్షన్ సుభాను, మండల కో అప్షన్ అజారుద్దీన్, సర్పంచ్ సరోజన మల్లేశం, ఎంపీటీసీ భూపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.