హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన ర్యాంకులను కేంద్రం ఇటీవల ప్రకటించింది. టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణ ఏడు ర్యాంకులను కైవసం చేసుకుంది. దేశంలోని తొలి ఆదర్శ గ్రామంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెన్నపంల్లి గ్రామం నిలిచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్పల్లి రెండో స్థానంలో, కందకుర్తి ఐదో స్థానంలో, తానాకుర్ద్ పదో స్థానంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం నాలుగో స్థానంలో, వీర్నపల్లి ఆరో స్థానంలో, రామకృష్ణాపూర్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో తొలి 10 గ్రామాల్లో 7 తెలంగాణకు చెందినవే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న పల్లె ప్రగతి వల్లే ఇది సాధ్యమైంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Now this is called Real Rural Development!
7 villages out of top 10 villages in the country under Saansad Adarsh Gram Yojana are from #Telangana 👍
Kudos to Hon’ble CM KCR’s brainchild “PallePragathi” & my compliments to Panchayat Raj Minister @DayakarRao2019 Garu & his team👏 pic.twitter.com/y5KC1fV3K3
— KTR (@KTRTRS) February 8, 2022
కాగా, ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ‘పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల ప్రగతికి పట్టం కట్టింది. ఆ ఫలాలు ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. తెలంగాణ గ్రామాలు సమగ్రంగా స్వయం సమృద్ధిగా మారుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ కార్య దీక్షా దక్షులు సీఎం కేసీఆర్ , అనునిత్యం ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు! ధన్యవాదాలు!! ఈ మహా యజ్ఞంలో కష్ట పడిన మా అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శుభాకాంక్షలు! అభినందనలు” అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు రీ ట్వీట్ చేశారు.