హైదరాబాద్: దక్కన్ ముద్ర గ్రూపుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు చెందిన యువత కొందరు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టారని, దక్కన్ ముద్ర గ్రూపును స్థాపించి.. తెలంగాణ సోనా బియ్యాన్ని ఆ గ్రూపు ప్రత్యేక ప్యాకెట్లలో అమ్ముతోందన్నారు. తెలంగాణ సోనా బియ్యంలో గైసిమెక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని, ఇది డయాబెటిక్స్ రోగులకు మంచిదని, ఇలాంటి బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చిన దక్కన్ గ్రూపునకు బెస్ట్ విషెస్ చెబుతున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. అయితే ఈ తరానికి చెందిన ఈ బియ్యాన్ని .. ప్రొఫెషర్ జయశంకర్ వ్యవసాయ వర్సటీలో శాస్త్రవేత్తలు ఇన్హౌజ్లో డెవలప్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
దక్కన్ ముద్ర గ్రూపులో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 400 మంది రైతులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇబ్రహీంపుర్, జనగాం, మాటెంద్ల, దుబ్బాక ప్రాంతాల్లో రైతులు ఈ పంటను పండిస్తున్నట్లు ఆయన తెలిపారు. దక్కన్ ముద్రకు చెందిన ఉత్పత్తులు సుమారు 150 రిటేల్ షాపుల్లో లభ్యం అవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరులోనూ దక్కన్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.