హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భావితరాల కోసం భారత రాజ్యాంగానికి అంబేద్కర్ రూపకల్పన చేశారు. అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని కేటీఆర్ తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.