హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట/ మహబూబ్నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరెంటుకు కాంగ్రెస్కు అస్సలు పడదని, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి కేసీఆర్ గెలిస్తే ఢిల్లీకి వచ్చి గులాబీ జెండా పాతుతాడనే అక్కడి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, కేసీఆర్ గొంతునొక్కి, బీఆర్ఎస్ను ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటివాళ్లు తెలంగాణకు క్యూకడుతున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా, ఎవరొచ్చినా భయపడేది లేదని, బీఆర్ఎస్ ప్రజలను నమ్ముకుందని పేర్కొన్నారు.
గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నారాయణపేట జిల్లా మక్తల్, హైదరాబాద్లోని ఉప్పల మల్కాజిగిరి రోడ్షోలలో పాల్గొన్నారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, హుజూర్నగర్లో శానంపూడి సైదిరెడ్డి, మక్తల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఉప్పల్, మల్కాజిగిరిలో బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజేశఖర్రెడ్డికి మద్దుతుగా వర్షంలోనూ రోడ్షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక, సాగునీరు రాక, తాగునీరు దొ రక్క, ఫ్లోరోసిస్తో పడ్డ ఇబ్బందులు చాలవా? అని ప్రశ్నించారు. ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు దేశముదుర్లని, కట్టుకథలు చెప్పి ఓట్లు వేయించుకుని బయటపడతారని హెచ్చరించారు. రవీంద్రకుమార్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే దేవరకొండ అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈసారి మూడు అంశాలకు ప్రాధాన్యం
హైదరాబాద్లో నిరంతర విద్యుత్, మెరుగైన నీటి సరఫరా, రహదారులు, బస్తీ దవాఖానాలు, 20కేఎల్ ఉచిత వాటర్ సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈసారి అధికారంలోకి వస్తే మూడు అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా కారణంగా మూసీ సుందరీకరణలో జాప్యం జరిగిందని, 14 బ్రిడ్జీలతో పాటు గోదావరి నీటితో జీవనదిగా మార్చి అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మెట్రోను 415 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని తెలిపారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టం కోసం 20 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
ఉప్పల్ ఫ్లై ఓవర్ ఒక్కటి కట్టడం చేతకాక బీజేపీ సిగ్గులేకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ఫ్లైఓవర్లు కడితే.. జాతీ య రహదారి పేరిట ఉప్పల్ ఫ్లైఓవర్ను బలవంతంగా తీసుకొచ్చి మనల్ని చావగొడుతున్నారని మండిపడ్డారు. రోడ్షోలలో దేవరకొండ ఎన్నికల ఇన్చార్జి అమిత్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బిల్యానాయక్, కిషన్లాల్, వడ్త్యా రమేశ్, జగన్లాల్, పల్లా ప్రవీణ్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా నాయకురాలు సుచరిత, బీఆర్ఎస్ పార్టీ మక్తల్ ఇన్చార్జి ఆంజనేయగౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్రా జు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్ దేవేందర్రెడ్డి, సోమశేఖర్, పావని, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గాడిదకు గడ్డేస్తే ఆవుకు పాలొస్తయా!
ప్రజల నోట్లో మన్నుకొట్టేందుకు కాంగ్రెస్ నేతలు మళ్లీ వస్తున్నారని, ఆ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యం ఖాయమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. గాడిదకు గడ్డివేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా? అలానే, కాంగ్రెస్కు ఓటేస్తే పనులు అవుతాయా? అని ప్రశ్నించారు. రేవంత్ చెప్తున్నట్టు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలా? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఎక్కడ వస్తుందని ప్రశ్నించే రేవంత్కు దమ్ముంటే కరెంటు వైర్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లలో క్యూలో ఎరువులు అమ్మారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్యారెంటీలన్నీ అటకెక్కేశాయని ఎద్దేవా చేశారు. ధరణి తీసేసి పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, మళ్లీ మనకు పట్వారీ వ్యవస్థ కావాలా? అని ప్రశ్నించారు. మంచి పను లు చేసిన ప్రభుత్వం, మంచినీళ్లు, సాగునీరు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, గ్రామాల్లో బ్రహ్మాండంగా మంచి పనులు చేసిన ప్రభుత్వం మనదేనని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి మళ్లీ అభివృద్ధికి సహకరించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ను నమ్మితే అధోగతే
సొంత డిక్లరేషన్పైనే నిలబడనంత గొప్ప పార్టీ అని కాంగ్రెస్ను ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్.. గ్యారెంటీ లేని కాంగ్రెస్ బిల్డప్ గాళ్లు నేడు గ్యారెంటీల పేరిట వస్తున్నారని, జాగ్రత్త అని హెచ్చరించారు. రాహుల్గాంధీకి ఎవుసం అంటే తెలియదని, క్లబ్బులు, పబ్బులు, చిందులు, విందులు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నారని కానీ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి, మైనపల్లి వెంకటస్వామి కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చారని విమర్శించారు. రాహుల్కు ఈ దేశం పప్పు అనే బిరుదు ఇచ్చిందని, అలాంటి పప్పు కోల్కతాలో మమతను, ఢిల్లీలో కేజ్రీవాల్ను, ఇక్కడికొచ్చి మనల్ని బీజేపీకి బీటీం అని విమర్శిస్తారని గుర్తు చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీటీం అని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని కోరారు.
రాహుల్గాంధీకి ఈ దేశమే పప్పు అన్న బిరుదు ఇచ్చింది. ఆ పప్పు కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని, ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ను, తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ను బీ టీం అని విమర్శిస్తారు. నిజానికి కాంగ్రెస్సే బీజేపీకి బీ టీం.
బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ఫ్లైఓవర్లు కడితే.. ఉప్పల్ ఫ్లైఓవర్ కట్టడం ఒక్కటి కట్టడం చేతకాని బీజేపీ సిగ్గులేకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్నది. జాతీయ రహదారి పేరుతో ఉప్పల్ ఫ్లైఓవర్ను బలవంతంగా తీసుకొచ్చి మనపై రుద్ది చావగొడుతున్నారు.
కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే గ్యారెంటీలన్నీ అటకెక్కేశాయి. అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారు. మనకు మళ్లీ పట్వారీ వ్యవస్థ కావాల్నా?
-మంత్రి కేటీఆర్