KTR | హైదరాబాద్ : రూ. 71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ బడి ద్వారా తడి, పొడి, హానికర చెత్త వేరుచేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ చేసే విధానంపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడుకలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ తెలిపారు. టీఎస్ఐపాస్ తరహాలో టీఎస్ బీపాస్ను తీసుకొచ్చాం. స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అవకాశం ఇచ్చాం. 9 ఏండ్లలోనే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించాం. దేశంలోనే ఇవాళ బెంగళూరును పక్కన పెట్టేసి.. ఐటీ రంగంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఏక కాలంలో పల్లె ప్రగతి, పట్టణాల ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని కేటీఆర్ తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేరోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఇవి తప్పకుండా విజయవంతం అవుతాయి. గ్రేటర్ పరిధిలో పని చేసే ప్రతి ఉన్నతాధికారి చిత్తశుద్ధితో, పట్టుదలతో పని చేస్తున్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే నానుడి నిజం చేయబోతున్నాం. ఇప్పటికే ఆ నానుడి అమలవుతోంది. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. భారతదేశంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారులు హైదరాబాద్కు తప్పకుండా వచ్చి మన వార్డు కార్యాలయాలను ప్రశంసిస్తారనే నమ్మకం ఉంది. పాఠశాలలను బలోపేతం చేసుకుంటున్నాం. మౌలిక వసతులు పెంచుకుంటున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
టీఎస్ బీపాస్ చట్టం గురించి విని తమిళనాడు సీఎం ఆశ్చర్యపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. దీన్ని తాము కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. 9 ఏండ్ల కాలంలో ఒక మున్సిపల్ మంత్రిగా, మా అధికారులు కానీ మేం ఎక్కడా కూడా దిక్కుమాలిన పనులు చేయలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతి రహితంగా పాలన కొనసాగిస్తున్నాం. కేసీఆర్ నాయకత్వంలో పరిశ్రమలకు, భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో పురోగమనంలో ఉన్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇక్కడితోనే సంతోషపడిపోవద్దు.. మనం సాధించాల్సింది ఇంకా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. రజనీకాంత్ హైదరాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఆయన వందల దేశాలు తిరిగిన వ్యక్తి. ఆయన వచ్చి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇది న్యూయార్క్లా అనిపించిందన్నారు. ఇది మా ఎస్ఆర్డీపీ అధికారులు, ఇంజినీర్ల గొప్పతనం. కరోనా కాలంలో అందరూ తమపనులు వదిలి వెళ్లిపోతే.. మా అధికారులు, ఇంజినీర్లు హైదరాబాద్ నగరంలో రాత్రింబవళ్లు పని చేసి రోడ్లను, ఫ్లై ఓవర్లను శరవేగంగా నిర్మించారు. వారికి అభినందనలు. కార్మికుల్లో ధైర్యం నింపి, వారిలో విశ్వాసం నింపి పని కల్పించారు మన అధికారులు అని కేటీఆర్ కొనియాడారు.
హైదరాబాద్ నగరంలో 22 వేల మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కరోనా సమయంలో బయటకు వచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతదేశంలో అత్యధిక వేతనం అందుకున్న సఫాయి కార్మికులు మన దగ్గరే ఉన్నారు. సఫాయి కార్మికులకు ప్రజలు సహకారం అందించాలి అని కేటీఆర్ కోరారు.