చేనేతపై ఐదు శాతం జీఎస్టీ వేసిన ఘనత ప్రధాని మోదీదే. ఇంత దుర్మార్గపు ఆలోచన ఇదివరకు ఏ ప్రధాని చేయలేదు. చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. హ్యాండ్లూం,పవర్లూం, హ్యాండీక్రాఫ్ట్ బోర్డులను, మహాత్మాగాంధీ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ స్కీంలను ఇప్పటికే రద్దు చేసింది. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారే. కేంద్రం రద్దు చేసిన వాటన్నింటినీ పునరుద్ధరించుకుందాం.
-మంత్రి కేటీఆర్
Minister KTR | రంగారెడ్డి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనున్నదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి నేతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేతపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. చేనేతపై ఐదు శాతం జీఎస్టీ వేసిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. ఇంత దుర్మార్గపు ఆలోచన ఇదివరకు ఏ ప్రధాని చేయలేదని విమర్శించారు. చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రానికి నేతన్నల గురించి తెలియదని.. హ్యాండ్లూమ్, పవర్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ బోర్డులను, మహాత్మాగాంధీ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ స్కీంలను రద్దు చేసిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేంద్రం రద్దు చేసిన వాటన్నింటినీ పునరుద్ధరించుకుందామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు.
కుల వృత్తులను బతికించుకునేలా కార్యక్రమాలు..
వివిధ రకాల కులవృత్తులు, చేతి వృత్తులను బతికించుకోవాలన్న ఉద్దేశంతో తొమ్మిదేండ్లుగా అన్ని రంగాల కార్మికులకు లాభం చేకూరే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దుబ్బాకలోని ఓ పద్మశాలి కుటుంబంలో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారని, మగ్గం ఏమిటో.. దాని చుట్టూ అల్లుకున్న నేతన్నల జీవితమేంటో కేసీఆర్కు తెలిసినంతగా ఏ ముఖ్యమంత్రికీ తెల్వదని అన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న రైతు బీమా ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాలేదన్నారు. టాటాలు మాత్రమే కాదు.. తాతలు మెచ్చిన కులవృత్తులు ఉంటేనే అభివృద్ధి అని సీఎం కేసీఆర్ చెప్తుంటారని అన్నారు. భూదాన్పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించి రూ.50 వేల చొప్పున అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతుల మాదిరిగానే నేతన్నలకు బీమా ఇస్తున్నామని, దీన్ని త్రిఫ్ట్ పథకానికి లింక్ చేసి 75 ఏండ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని తెలిపారు. గతంలో కరోనా సమయంలో కార్మికులు త్రిఫ్ట్ పథకంలో పొదుపు చేసిన డబ్బులు మెచ్యూరిటీ తీరనప్పటికీ రూ.100 కోట్లను 36 వేల కుటుంబాలకు అందజేసి ఆదుకున్నామని తెలిపారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని మంత్రి కోరారు.
నేటి నుంచే చేనేత మగ్గం పథకం అమలు..
మన్నెగూడ వేదికగా మంత్రి కేటీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ పేరుతో తక్షణమే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద నేతన్నలకు కొత్తగా ఫ్రేమ్ మగ్గాలను అందించనున్నామని తెలిపారు. చేనేత కళను ఆదుకోవాలంటే ఆధునీకరణ అవసరమని, గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రూ.40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలను అందుబాటులోకి తెస్తామని, దీనివల్ల కార్మికుల అనారోగ్య సమస్యలు దూరమవ్వడంతోపాటు వారి శ్రమ తగ్గి నాణ్యమైన చేనేత వస్ర్తాల ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు. తెలంగాణ నేతన్న నైపుణ్యం చూసి దేశమే అబ్బురపడేలా ఉప్పల్ భగాయత్లో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. శిల్పారామంను సందర్శించే వారు పక్కనే కన్వెన్షన్ సెంటర్లో చేనేత వస్ర్తాలను కొనుగోలు చేసే ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. 2017లోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని, సూరత్కు వలసవెళ్లిన కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పారిశ్రామికవేత్తలుగా తిరిగి రావడం సంతోషం కల్గిస్తున్నదని అన్నారు. దివాలాతీసిన పోచంపల్లి హ్యాండ్లూం పార్కును ప్రైవేటుకు అప్పజెప్పకుండా ప్రభుత్వమే రూ.12.50 కోట్లతో కొనుగోలుచేసి పునరుద్ధరించనున్నదని, ఆ పార్కుతో నేతన్నలకు మరింతగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తాను ఎక్కడికెళ్లినా చేనేత వస్ర్తాలను వెంట తీసుకెళ్తానని, ఎవరినైనా చేనేత వస్ర్తాలతోనే సన్మానిస్తానని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ చేనేత స్టాల్స్ను ఏర్పాటు చేసి మరింత మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చేనేత సంఘాలపై రుణభారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకం కింద 2022-23 సంవత్సరానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మంత్రి కేటీఆర్ సంబంధిత నిధులకు సంబంధించిన చెక్కులను ఆయా జిల్లాలకు అందజేశారు. కరీంనగర్ జిల్లాకు రూ.29.96 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ.40.47 కోట్లు, జోగులాంబ గద్వాల జిల్లాకు రూ.19.52 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.19.54 కోట్లను అందజేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికైన వారిని మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు. 162 మందికి రూ.25వేల పారితోషికాన్ని అందజేసి సత్కరించారు. చివరగా వేడుకలకు వచ్చిన నేతన్నలతో కలిసి మంత్రి కేటీఆర్ జాతీయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చేనేత, జౌలిశాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్, హ్యూండ్లూం చైర్మన్ చింతప్రభాకర్, పవర్లూం చైర్మన్ గూడూరు ప్రభాకర్, జౌలిశాఖ కార్యదర్శి వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్లో చేనేత భవనం, మ్యూజియంకు శంకుస్థాపన
ఉప్పల్ : ఉప్పల్ శిల్పారామం ప్రాంతంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం చేనేత భవనం, మ్యూజియం పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో 2,576 చదరపు గజాల విస్తీర్ణంలో చేనేత భవనం, రూ.15 కోట్లతో 500 చదరపు గజాల స్థలంలో మ్యూజియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మె ల్సీ రమణ, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
చేతివృత్తులకు చేయూతనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: శ్రీనివాస్గౌడ్
తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతివృత్తుల జీవన ప్రమాణాలు పెంచటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషిచేశారని, ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చేనేత దినోత్సవ సంబురాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. నేతన్నలకు, గీతన్నలకు ఎంతో దగ్గరసంబంధం ఉన్నదని, వారి తలరాతలు మార్చిన కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని అన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కరోనా సమయంలో కూడా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవటం కోసం వారికి ముడిసరుకు కొనుగోలుకు నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల బీమాకోసం నిర్దేశించిన 59 సంవత్సరాల వయోపరిమితిని 75 సంవత్సరాలకు పొడగించాలని కోరారు.
చేనేత కార్మికులపై వరాల జల్లు
హైటెక్స్లో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్లో సోమవారం చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్యాషన్ షో విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక మోడళ్లు, పిల్లలు, మహిళలు దాదాపు 80 మంది ఈ షోలో పాల్గొనడంతో సందడి నెలకొన్నది.