హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నేత కార్మికులు అద్భుత కళాకారులు అని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నేతన్నబీమాపై హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేతన్న చీరను మగ్గంపై నేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా తెలంగాణలో నేత కార్మికులకు బీమా పథకం, దురదృష్ణవశాత్తు నేత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం, నేత కార్మికులకు బీమాతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా. 60 ఏండ్లలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడు. రాష్ట్రంలో సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి అనే పదాలతోపాటు ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు మంత్రి కేటీఆర్ ఫొటోలను పొందుపరిచారు. దీనిని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ‘తెలంగాణ చేనేత అండ్ పవర్లూమ్ కార్మికులు.. నిజమైన కళాకారులు. నేతన్నబీమాపై సిరిసిల్లకు చెందిన వెల్దె హరిప్రసాద్ అందమైన నేత కళతో ఇలా తన ఆనందం వ్యక్తంచేశారు. నాలుగు రోజుల్లో పని పూర్తి చేసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆయనకు నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణలో స్కామ్గ్రెస్ పురోగతి: మంత్రి కేటీఆర్
ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి దాసోజు శ్రవణ్ రాజీనామా చేస్తూ రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘హుందాగా ఉండే కాంగ్రెస్ నుంచి దోపిడీ కాంగ్రెస్ వరకు తెలంగాణలో స్కామ్గ్రెస్ పురోగతి.. ఇవి నా మాటలు కాదు. నిన్న రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పినవి’ అని ట్వీట్ చేశారు.