హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఒకప్పుడు ఎండిపోయిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ నేడు భారతదేశపు ధాన్యాగారంగా మారుతున్నదని, దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్నికేంద్ర ప్రభుత్వం గుర్తించాలని శుక్రవారం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గతంలోనూ జాతీయ హోదా గురించి కేంద్రాన్ని అడిగామని, ఇంతవరకు స్పందించలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఈ నెలాఖరుదాకా మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన
అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న మంత్రి కే తారకరామారావు తన విదేశీ పర్యటనను ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. ఈ నెల 16 నుంచి దాదాపు 10 రోజులపాటు అమెరికాలోని పలు ప్రతిష్ఠాత్మక ఐటీ సహా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చల ఫలితంగా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులను, ఉద్యోగాలను తీసుకొచ్చేందుకు కేటీఆర్ కృషి చేశారు. మిగిలిన నాలుగు రోజులు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెలాఖరుకు తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు.