హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అబద్ధాలైనా ఒకేవిధంగా చెప్పేలా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురక అంటించారు. ‘9 వైద్య కళాశాలలు మంజూరు చేశామని కిషన్రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదని మన్సుఖ్ మాండవీయ అంటున్నారు.
రెండు ప్రతిపాదనలు అందాయని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. మోదీజీ.. కనీసం అబద్ధాలైనా ఒకేలా చెప్పేలా కేంద్రమంత్రులకు శిక్షణ ఇవ్వండి’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలంగాణకు మంజూరు కానీ 8 మెడికల్ కాలేజీలను సృష్టించిన ఘనత కిషన్రెడ్డికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఆయుష్ పేరిట హైదరాబాద్లో ఓ కల్పిత గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ను కూడా ప్రకటించారని, కేంద్రమంత్రులందరిలో కిషన్ రెడ్డి ఆణిముత్యం అంటూ ఎద్దేవా చేశారు. అటు.. తన ట్విట్టర్ ఖాతాకు గుర్తింపు బ్యాడ్జీ రాకపోవటంపైనా కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ సీఈవో కుర్చీలో కుక్క కూర్చున్న ఫొటోను ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాకు గుర్తింపు బ్యాడ్జీ రాకపోవటం ఆశ్చర్యం కలిగించలేదని సెటైర్ వేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, అందులో తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.
– కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
(జూలై 31, 2021)
మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరితే, తెలంగాణ పంపిన ప్రతిపాదనలు ఎన్ని? జీరో.
– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్
మాండవీయ (ఆగస్టు 29, 2022)
మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపాలని కోరితే కరీంనగర్, ఖమ్మం లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 2 ప్రతిపాదనలు పంపింది.
– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
(ఫిబ్రవరి 16, 2023)