హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యధికంగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) అనుమతులను తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నదని, ఇది మనకు గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన యూఎస్ ఎఫ్డీఏ ప్రతినిధుల బృందంతో శుక్రవారం టీహబ్లో రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా యూఎస్ఏ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఎఫ్డీఏ కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగీర్దార్ పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎంతో కీలకమైన సంస్థ యూఎస్ ఎఫ్డీఏ అని, అలాంటి సంస్థ ప్రతినిధులు తెలంగాణ పర్యటనకు రావ డం రాష్ట్ర ప్రాముఖ్యతను తెలియజేస్తున్నదని చెప్పారు. వైద్య పరికరాలు, ఆరోగ్య సాంకేతిక ఆవిష్కరణల రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని యూఎస్ ప్రతినిధులకు వివరించినట్టు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్నదని, 2030 నాటికి పెట్టుబడులు 250 బిలియన్లకు చేరకుంటాయని అం చనా వేశామని కేటీఆర్ తెలిపారు. టీ హబ్ కేం ద్రంగా మెడికల్ డివైజెస్, డిజిటల్ హెల్త్ విభాగాల్లో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సాంకేతికత భవిష్యత్తును మార్చేలా ఉంటాయని మంత్రి చెప్పారు. టెక్నాలజీ స్టార్టప్లే కాకుండా వైద్య, ఆరోగ్య రంగంలోనూ కొత్త ఆవిష్కరణలతో స్టార్టప్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని చెప్పా రు. ఎఫ్డీఏ ప్రతినిధులు టీ హబ్ను సందర్శించడంతో ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు మరింత పురోగతి లభిస్తుందని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు చెప్పారు. తెలంగాణలో ఆవిష్కరణల వ్యవస్థను పరిశీలించడం ఎఫ్డీఏ ప్రతినిధుల బృందం పర్యటన ఉద్దేశమని తెలిపారు.