హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): బిజినెస్, బిర్యానీ గురించే తాను, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చర్చించుకొన్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, టీహబ్ తదితర అంశాలపై చర్చించుకొన్నారు. ఆ భేటీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇద్దరు హైదరాబాదీలు కలిసి ఈ రోజును ప్రారంభించడం శుభపరిణామం. సత్య నాదెళ్ల, నేను బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకొన్నాం’ అని ట్వీట్ చేశారు.
సత్య నాదెళ్ల 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్లో పాల్గొన్నారు. కృత్రిమ మేధ ఆధారిత చాట్ రోబో ‘చాట్ జీపీటీ’తో సంభాషించారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలో పేరొందిన టిఫిన్ల పేర్లు చెప్పాలని ఆయన చాట్ జీపీటీని కోరగా.. ఇడ్లీ, దోశ, వడతోపాటు బిర్యానీ పేరును కూడా చెప్పింది. దీనిపై సత్య నాదెళ్ల సీరియస్ అయ్యి.. బిర్యానీ టిఫిన్ కాదని, అలా చెప్పి తనను బాధపెట్టొద్దని అన్నారు. దీంతో చాట్ రోబో ఆయనకు క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో బిర్యానీని ప్రస్తావించటం గమనార్హం.