Minister KTR | మహబూబ్నగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత ప్రభుత్వాలు రెడ్టేపిజంతో పరిశ్రమలు రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తాము కంపెనీలకు రెడ్కార్పెట్ పరిచామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం వేముల గ్రామంలో రూ.500 కోట్లతో నిర్మించనున్న ఎస్జీడీ కార్నింగ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు.
జడ్చర్ల పట్టణంలోని ఎర్రగుట్టలో రూ.42 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. మహబూబ్నగర్ పట్టణంలో రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శాంత నారాయణగౌడ్ ట్రస్ట్, సయంట్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పూర్తిచేసుకొన్నవారికి ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు కల్పించటం ఎవరికీ సాధ్యం కాదని, అందుకే ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు సృష్టిస్తున్నామని వెల్లడించారు. ఇటీవలే దివిటిపల్లిలో రూ.9 వేల కోట్ల పెట్టుబడితో అమరరాజా లిథియం బ్యాటరీ తయారీ ప్లాంటు, దాని పక్కనే ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కంపెనీలకు అన్నిరకాల అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని తెలిపారు.
ప్రజలను గోసపెట్టిన కాంగ్రెస్
అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను పట్టించుకోకుండా గోసపెట్టిన కాంగ్రెస్ నేతలు.. నేడు యాత్రలంటూ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్ని వందల కిలోమీటర్లు తిరిగినా ప్రజలు కాంగ్రెస్ను పట్టించుకోరని స్పష్టంచేశారు. గ్రామాల్లో బంధువులు చనిపోతే స్నానాల కోసం మోటర్ల పెట్టుకోవటానికి విద్యుత్తు ఇవ్వాలని కరెంటోళ్లను బతిమాలాడిన రోజులు కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడన్నా కరెంట్ రోజులో ఆరుగంటలకంటే ఎక్కవ వచ్చిందా? అది కూడా రెండు దఫాలుగా ఇస్తుండె. ఇయ్యాల ఆ పరిస్థితి ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
‘నాటి కాంగ్రెస్ పాలకులు చెరువులను పట్టించుకోలె. సాగునీటిని పట్టించుకోలె. పాలమూరు ఎత్తిపోతలను పట్టించుకోలె. పరిశ్రమలు తేవాలని సోయి రాలె. ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడ సరిగా ఇయ్యలె.. నాడు రూ.200 పెన్షన్ ఇచ్చి ఇంద్రుడు, చంద్రుడు అని డబ్బా కొట్టుకొనేవాళ్లు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి నెలకు రూ.200 చొప్పున పెన్షన్లు ఇస్తే.. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం 46 లక్షల మందికి నెలకు రూ.2000 పెన్షన్ ఇస్తున్నదని గుర్తుచేశారు. పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఏ రంగంలో చర్చకు వస్తారో రండి.. మీరు చేసిన ఉద్ధారకం ఏంది? మేం చెడగొట్టింది ఏందో ప్రజల మధ్యనే చర్చిద్దాం రండి’ అని సవాల్ విసిరారు.
తేడా గుర్తించండి
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకొన్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే రైతుల కష్టాలు తీరాయని, ఏ ప్రధానమంత్రులు కూడా చేయని గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ రైతును రాజును చేశారని అన్నారు. ‘వానకాలం, యాసంగి పంటలు వేసే సమయం వచ్చిందంటే రైతుబంధు పైసలతో మీ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగుతలేవా? పైసలు మీ బ్యాంకు ఖాతాల్లో పడ్తలేవా? గతంలో కాంగ్రెసోళ్లు అరపైసా అయినా ఇచ్చిండ్రా? వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు చేయలేదు? సీఎం కేసీఆర్ దిల్ ఉన్న నాయకుడు కాబట్టి రైతు కుటుంబం రోడ్డున పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబీమా ఇస్తున్నారు.
రైతులు రూపాయి కూడా కట్టే అవసరం లేకుండా రూ.1,450 కోట్ల ప్రీమియం ప్రభుత్వమే కట్టి లక్షల మంది రైతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలో నాలుగైదు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఎక్కడన్నా రైతుబీమా ఉన్నదా? ఎక్కడన్నా రైతుబంధు ఉన్నదా? ఎక్కడన్నా రూ.2000 పెన్షన్ ఇస్తున్నరా? ఉచిత విద్యుత్తు ఇచ్చే సంస్కారం ఉన్నదా? గతంలో ఏమీ చేయనోళ్లు ఇయ్యాల మళ్లీ వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లను నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చేతిలో పిచ్చోళ్లు వాళ్ల పార్టీని పెట్టిండ్రు. పొరపాటున ఆ దిక్కుమాలిన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చినా మళ్లీ పెన్షన్ రూ.200 అయితది. మూడు గంటల కరెంట్ వస్తది.. రైతుబంధుకు, దళితబంధుకు రాంరాం చెప్తారు’ అని హెచ్చరించారు.
నాటి కాంగ్రెస్ పాలనకు, నేటి బీఆర్ఎస్ పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చుకుంటూ, పరిశ్రమలు తెచ్చుకుంటూ, మంచినీళ్లు తెచ్చుకుంటూ, కరెంట్, సాగునీటి సమస్యలు పరిష్కరించుకొని, గృహలక్ష్మి పథకంతో మళ్లీ ఒక 4000 ఇండ్లు ఇచ్చుకొని, కొత్తగా ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు ఇచ్చుకొని ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నాం. గిరిజన సోదరుల రిజర్వేషన్ను ఆరు నుంచి 12 శాతం చేసినా, తండాలను పంచాయతీలుగా చేసినా ఆ క్రెడిట్ మొత్తం సీఎం కేసీఆర్కే దక్కుతుంది. పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తూ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనులకు భూ పట్టాలు అందివ్వబోతున్నాం. ఇష్టమొచ్చినట్టు మాట్లాడేటోళ్లు.. మనది కాకపోతే కాశీ వరకు పోదాం అనేటోళ్లు.. ఫేక్గాళ్లు చాలామంది ఉంటారు. పనిచేసి ప్రజల మనసు గెలుచుకొనే నాయకులు మాత్రం అరుదుగా ఉంటారు. అందుకే పనిచేసే జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఈసారి 90 వేల మెజార్టీతో గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. జిల్లాకు చెందిన మోహన్రెడ్డి బాలికల ఐటీఐని కూడా దత్తత తీసుకొని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటం గొప్ప విషయమని ప్రశంసించారు.
రాష్ట్ర వృద్ధికి ఎస్జీడీ కార్నింగ్ ఊతం
రాష్ట్రంలో ఆర్థిక వృద్ధికి ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఊతం ఇవ్వనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అయన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల వద్ద రూ.500 కోట్లతో నిర్మించనున్న ఎస్జీడీ కార్నింగ్ కంపెనీ యూనిట్-2కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధిలో ఈ సంస్థ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఈ సంస్థలో ప్రత్యక్ష్యంగా పరోక్షంగా 1,500 నుంచి 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
కాంగ్రెస్ దివాలా తీసిన పార్టీ: మంత్రి మల్లారెడ్డి
కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ హయాంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదు. ఇప్పుడొచ్చి మళ్లీ అధికారం ఇవ్వాలని అడుగుతుండ్రు. ఏం మొఖం పెట్టుకొని వస్తారు. మీకు ఎవడు ఓటు వేస్తడు? ఎందుకు ఓటు వేయాలి?’ అని ప్రశ్నించారు. 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపోళ్లు ఏ ఒక్క రాష్ట్రంలో అయినా తెలంగాణ మాదిరిగా కరెంట్, నీళ్లు ఇస్తుండ్రా? అని నిలదీశారు. ‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా సస్యశ్యామలం. వరి ఉత్పత్తిలో నాడు పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ ముందుంటే.. నేడు వాటిని దాటేసి తెలంగాణ అగ్ర స్థానానికి చేరుకొన్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్లే వడ్లు.. ఇదంతా కేసీఆర్ చలవే’ అని కొనియాడారు. మంత్రి కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నారని, ఇప్పటికే 42 వేల ఉద్యోగాలు తెచ్చారని ప్రశంసించారు. 2024లో కాబోయే ప్రధాని కేసీఆర్ అని.. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని స్పష్టంచేశారు.
తెలంగాణ వచ్చినంకనే పాలమూరు కష్టాలు తీరాయి: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా కరువు, వలసలతో విలవిలలాడిందని.. గుక్కెడు మంచినీళ్లు ఇచ్చినవాళ్లు లేరని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చినంకనే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే పాలమూరు కష్టాలు తీరాయని పేర్కొన్నారు. దివిటిపల్లి వద్ద అమరరాజా బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశామని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన జరుగుతున్నదని చెప్పారు. నిరుపేదల మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన సయంట్ ఫౌండేషన్ అధినేత బీవీ మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్నగర్లో ఐటీ పరిశ్రమ కూడా పెట్టాలని, అందుకోసం లక్ష చదరపు అడుగుల జాగా కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, జిల్లా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహగౌడ్, జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్, మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.