హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను నిర్వహిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఐటీశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కనెక్టెడ్ అటానమస్ షేర్డ్ అండ్ ఎలక్ట్రిక్(సీఏఎస్ఈ) మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ పోస్టర్ను బుధవారం ఆయన కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలోని స్టార్టప్ల నిర్వాహకులు ఎవరైనా ఇందులో పాల్గొని మంచి పరిష్కారాలను సూచించవచ్చునని చెప్పారు.
కొత్త రవాణా విధానాలకు తెలంగాణ రాష్ర్టాన్ని హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో పలు ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిని స్టార్టప్లు మంచి అవకాశంగా తీసుకొని వినూత్న ఆలోచనలతో రవాణారంగ సమస్యలకు పరిష్కారాలు చూపాలని పిలుపునిచ్చారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రవాణా రంగంలో సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో నిర్వహించనున్న ఈ-మొబిలిటీ వీక్ కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంగా నిలుస్తుందని అన్నారు. దీనిని ఈవీ, మొబిలిటీ విభాగంలోని ఔత్సాహిక స్టార్టప్ల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రాండ్ చాలెంజ్లో విజేతగా నిలిచిన వారికి రూ.80 లక్షలు (లక్ష డాలర్లు) గ్రాంట్ రూపంలో ఇస్తామని తెలిపారు. పారిశ్రామిక నిపుణులు ఆయా సార్టప్లకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారని, ఐఐటీ హైదరాబాద్తోపాటు తెలంగాణ మొబిలిటీ వ్యాలీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగే తుది రౌండ్ పోటీలో టాప్-10లో ఉన్న వాటిని ఎంపిక చేస్తారని వెల్లడించారు. వివరాలకు www.evhyderabad.in వెబ్సైట్లో చూడాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ సెక్రటరీ (ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్) డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, చీఫ్ రిలేషన్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.