హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల ఉద్యమ నేత.. మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఉద్యమ ప్రస్థానంపై ‘యోధ’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన సిద్దిపేట ఉద్యోగ గర్జన చారిత్రక రోజు (21-10-2009)ను పురస్కరించుకొని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీజీవో కలిసి రూపొందించిన ఈ పుస్తకాన్ని శ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం.. ఉద్యోగుల పాత్ర.. ఉద్యమ ప్రధాన ఘట్టాలను ఆధారంగా తీసుకొని దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి చేపట్టిన ఉద్యమాన్ని.. పోరాట ప్రధాన ఘట్టాలను మంత్రి కేటీఆర్ నెమరు వేసుకొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, పీ రవీందర్కుమార్, ఎంబీ కృష్ణాయాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, రవీందర్రావు, బీ వెంకటయ్య, పీ కృష్ణమూర్తిగౌడ్, అరుణ్కుమార్, సబిత, సుజాత, జగన్మోహన్రావు, పరమేశ్వర్రెడ్డి, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.