Minister KTR | బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో రోడ్షో నిర్వహించారు. రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
ప్రధానంగా గల్ఫ్లో ఉపాధి కోసం వెళ్లిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరే రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు సైతం బీమా అందిస్తామని తెలిపారు. గల్ఫ్ బీమా పథకం కింద రూ.5లక్షల బీమా కవరేజ్ ప్రతి ఒక్కరికి అందుతుందని తెలిపారు. దీంతోపాటు గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని వివరించారు.