మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో రూ.20కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్కు భూమి పూజ చేడయంతోపాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్ను ప్రారంభించారు. రూ.4కోట్ల వ్యయంతో కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేశారు. సింగారం వద్ద మిషన్ భగీరథ పంప్ హౌస్ ను, అక్కడే సిద్ధం చేసిన సబ్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు.
ఆరో వార్డులో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న పార్కు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంత్రి.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ పార్కు వద్ద రూ.20 కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్కు భూమిపూజ చేశారు.
పట్టణ క్రీడాకారుల కోసం రూ. 6.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు, ఎర్రగుట్ట వద్ద రూ. 2కోట్లతో జిల్లా గ్రంథాలయం భవన నిర్మాణానికి, రజకుల కోసం రూ. కోటితో చేపట్టే ఆధునిక లాండ్రీకి భూమిపూజ చేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, డా. సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సురభి వాణీ దేవి, కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఇంతియాజ్ ఇసాక్, జడ్పీ చైర్ పర్సన్లు స్వర్ణ, వనజ, కలెక్టర్ దాసరి హరిచందన, పార్టీ నేతలు దేవర మల్లప్ప, చిట్టెం సుచరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.