Minister KTR | హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్పైకి చేరనున్నది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది.
వంతెన పొడవు 956 మీటర్లు కాగా.. వెడెల్పు 16 మీటర్లు. హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లలో ఇదే అతి పొడవైనది కావడం విశేషం. ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనున్నది. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వంతెనను ప్రారంభించిన అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి తిలకించారు.