మణికొండ, ఏప్రిల్ 7: ప్రజారోగ్య వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దవాఖానలు, మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అవసరమైన వారికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కంటి సంరక్షణ చికిత్సలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. శంకర ఐ ఫౌండేషన్ (ఇండియా,యూఎస్ఏ) ఆధ్వర్యంలో నార్సింగిలో 1.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 225 పడకలతో నిర్మించిన శంకర కంటి సూపర్ స్పెషాలిటీ దవాఖానను (దేశంలో 13వది) మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దవాఖానలో కాటరాక్ట్, కార్నియా, గ్లకోమా, పీడియాట్రిక్ ఆప్తమాలజీ, స్ట్రాబిస్మస్, ఆర్బిట్, అకులోప్లాస్టీ, విట్రియోరెటినల్ అధునాతన విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. శంకర కంటి దవాఖాన దేశవ్యాప్తంగా వేలమందికి సేవలందిస్తూ, జాతీయ కంటి ఆరోగ్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ప్రశంసించారు. గొప్ప లక్ష్యంతో ముందుకొచ్చిన శంకర నేత్రాలయానికి ప్రభుత్వపరంగా తమవంతు సహాయం అందిస్తామని చెప్పారు.
సాకారమవుతున్న ఆరోగ్య తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐదేండ్ల క్రితమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మూడుకోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు చేయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మరో కోటి మందికి కంటి పరీక్షలు చేయించి, అవసరమైనవారికి ‘మేడిన్ తెలంగాణ’ అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని వెల్లడించారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి శంకర నేత్రాలయ సహకారంతో వైద్యం అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నినాదంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణంతోపాటు పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో నాణ్యమైన వైద్య సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను నిర్మించామని, రానున్న రోజుల్లో 33 మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. శంకర నేత్రాలయ ఏటా 30 వేల మందికి కంటి పరీక్షలు చేసే సంకల్పంతో ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు.
విపక్షాలది గుడ్డితనం
దేశంలో అందరికీ తెలంగాణ అభివృద్ధి కన్పిస్తున్నా, ప్రతి పక్షాలకు మాత్రం కండ్లు కన్పించడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ముందుగా ప్రతిపక్ష నేతలకు కంటి పరీక్షలు చేయించాలని అనటంతో సభలో నవ్వులు విరిశాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు, సర్జరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారని, శంకర ఐ ఫౌండేషన్ యాజమాన్యం ఇందుకు చొరవ చూపాలని కోరారు. శంకర్ ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణి వారణాసి మాట్లాడుతూ.. నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంతో తమ సంస్థను ఏర్పాటుచేశామని చెప్పారు. 2030 నాటికి దేశంలో ఏటా 5 లక్షల ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయడం, ప్రజలకు అత్యుత్తమ కంటి సంరక్షణ చికిత్సను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల పరిధిలో గ్రామీణ పేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్నవారు మనదేశంలోని ఎక్కువ మంది ఉన్నారని, 80 శాతం మంది నివారించదగ్గ అంధత్వంతో బాధపడుతున్నారని ఎస్ఈఏ యూఎస్ఏ వ్యవస్థాపకులు మురళి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శంకర నేత్రాలయ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.