ఒక నగరం స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు.. దాని చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఇలాంటి మెట్లబావి వంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించిన వాళ్లమవుతాం. ప్రభుత్వం నిధులను కేటాయించి పునరుద్ధరించగలదే కానీ, చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సింది స్థానికులే. ఇది మీ ఆస్తి. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే మెట్లబావిని మీరే కాపాడుకోవాలి. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా హైదరాబాద్కు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే వీటిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బన్సీలాల్పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పిలుపునిచ్చారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఆరు మెట్లబావులను ఆగాఖాన్ ఫౌండేషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరించిందని, వాటికి ఇటీవల యునెస్కో గుర్తింపు దక్కడం గర్వంగా ఉన్నదని చెప్పారు. మొజంజాహీ మార్కెట్, మీరాలం మండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్పేట సరాయి, పలు దేవ్డీలకు పూర్వవైభవం సంతరించుకునేలా చర్యలు తీసుకుంటామని, వాటితోపాటు నగరంలోని 43 పురాతన బావులనూ పునరుద్ధరిస్తామని కేటీఆర్ వివరించారు.
పూర్తిగా పూడికతో నిండిపోయి రూపురేఖలు కోల్పోయిన బన్సీలాల్పేట మెట్లబావిని రూ.10కోట్ల వ్య యంతో ప్రభుత్వం పునరుద్ధరించింది. పూర్వవైభవం సంతరించుకునేలా అందంగా తీర్చిదిద్దిన ఈ పురాతన మెట్లబావిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు బావి పరిసర ప్రాం తాల్లో ఆయన కలియతిరిగారు. ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలు, చక్కటి పచ్చదనంతో నిండిన ల్యాండ్స్కేప్ గార్డెన్, ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఏర్పా టు చేసిన ఓపెన్ యాంఫీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, బావి చరిత్రను వివరించే ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. బావిని అందంగా ముస్తాబు చేయడంలో 13 నెలలపాటు శ్రమించిన రెయిన్వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్, గండిపేట వెల్ఫేర్ సోసైటీ ప్రతినిధి రాజశ్రీ, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. జ్ఞాపికలతో వారిని సత్కరించారు.
3900 టన్నుల చెత్తను తొలగించాం
ప్రభుత్వపరంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటామని, బన్సీలాల్పేట బావిని అందంగా తీర్చిదిద్దడం వంటివి ఆత్మనిండా సంతోషాన్ని నింపుతాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఇదేం చిన్న విషయం కాదు. 863 ట్రిప్పుల లారీలతో 3,900 టన్నుల చెత్తను వెలికితీస్తే.. మట్టిలోంచి మాణిక్యాలు బయటపడినట్టు ఈ చారిత్రక కట్టడం వెలుగుచూసింది. దానికి పూర్వవైభవం తెచ్చేందుకు ఎంతోమంది శ్రమించారు. అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక నగరం స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు, దాని చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఇలాంటి మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు వాటిని అందించిన వాళ్లం అవుతాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులను కేటాయించి పునరుద్ధరించగలదే కానీ, చారిత్రక కట్టడాలను పరిక్షించుకోవాల్సింది మాత్రం స్థానికులే అని కేటీఆర్ అన్నారు. వారసత్వ సంపదను నాశనం చేసుకోవద్దని, కచ్చితంగా కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టన్నులకొద్దీ చెత్తను స్వహస్తాలతో తీసి అందమైన కానుకను హైదరాబాద్కు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు, స్థానికులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
సంబురంగా కార్యక్రమం
మెట్లబావి ప్రారంభోత్సవం పండువులా సాగింది. విద్యుద్దీపాలతో అలంకరించిన మెట్లబావి అందరినీ ఆకట్టుకున్నది. మంత్రి కేటీఆర్ సైతం అందరినీ పలకరిస్తూ, అడిగిన వారికి సెల్ఫీలు ఇస్తూ ఉత్సాహంగా గడిపారు. మట్టి పొరల కింద కప్పివేయబడిన బావిని వెలికితీసి అందంగా మార్చి తమకు కానుకగా ఇవ్వడంపై స్థానికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి నృత్యప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, పురపాలకశాఖ ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, గ్రేటర్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ సామల హేమ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బన్సీలాల్పేట మెట్లబావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శనలో
వస్తువులను పరిశీలిస్తున్న మంత్రులు కే తారక రామారావు. తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు