ఐటీ రంగం అభివృద్ధిపై ఇంతటిస్థాయిలో దృష్టి సారించిన మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ లాంటి వారిని దేశంలో మరోచోట చూడలేదు. మౌలిక వసతుల కల్పన, గ్లోబల్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ చొరవ.. ఇవన్నీ హైదరాబాద్ను ముందుకు తీసుకెళ్తున్నాయి.
-ఐఈఎస్ఏ అధ్యక్షుడు కే కృష్ణమూర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఆ రంగం, ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పరిశ్రమలను తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి, తీసుకొంటున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అన్ని వర్గాల నుంచి పొగడ్తలు దక్కుతున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో సాటి లేదని నిరూపించుకున్న హైదరాబాద్కు మరో కితాబు అందింది. టెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా మారిందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) అధ్యక్షుడు, సీఈవో కే కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీస్ ఇండియా ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్లో అద్భుతమైన నాయకత్వం ఉన్నదని కొనియాడారు. అత్యంత అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను ఇక్కడ సృష్టించారని శ్లాఘించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్కు చెందిన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఐఈఎస్ఏకు హైదరాబాద్కు మించిన ప్రాంతం దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించే ఐఈఎస్ఏ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ప్రకటించారు. తాను ఏటా హైదరాబాద్లో 3-4సార్లు పర్యటిస్తుంటానని, ఇక్కడ చాలా మార్పులు చోటుచేసుకొన్నాయని వెల్లడించారు. ‘ఐటీ రంగం అభివృద్ధిపై ఈ స్థాయిలో దృష్టి సారించిన మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ లాంటి వారిని దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా చూడలేదు. ఇక్కడి మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గవి.. మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ కంపెనీలు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ భేష్. ఇవన్నీ రాష్ర్టాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నాయి’ అని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి చాలా మంది అభినందిస్తున్నారని పేర్కొన్నారు.
ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ లీడర్: లుహరుక
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ ఒక కాంతి పుంజం అని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఎక్స్లెన్స్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ సీఏ అరుణ్ లుహరుక కొనియాడారు. సోమవారం హెచ్ఐసీసీలో ఎఫ్టీసీసీఐ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.17 లక్షలుగా ఉన్నదని, ఇది దేశ సగటు రూ.1.46 లక్షలు కన్నా చాలా ఎక్కువ అని అన్నారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ప్రమాణాలు వందల్లో ఉన్నాయని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనతో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు తరలివస్తున్నాయని వివరించారు. ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ ప్రస్తుతంగా లీడర్గా ఉన్నదని తెలిపారు. అటు.. రాష్ర్టాల పనితీరును గుర్తించటంలో కేంద్ర విభాగాలు విఫలం అవుతున్నాయని విమర్శించారు. రాష్ర్టాలు దేశంలో భాగం కాదా? అని ఆయన ప్రశ్నించారు.