హైదరాబాద్ : ఆరుదశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన ఒక అసామాన్య వ్యక్తి.. ఉద్యమశక్తి.. దార్శనికుడు.. వ్యూహకర్త.. విభిన్నరాజకీయవేత్త. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తనదైన శైలిలో సంచలనాలు సృష్టించబోతున్న ఈ సందర్భంలో.. ఒక నంది అవార్డు రచయితగా, ఫిలిం డైరెక్టర్గా, కేసీఆర్ డైహార్డ్ అభిమానిగా, తెలంగాణ బిడ్డగా మనోహర్ చిమ్మని సీఎంకు అందిస్తున్న చిరుకానుక ‘కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పుస్తకం.
ఈ పుస్తకాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత 60 ఏండ్లుగా ఎవరూ సాధించని తెలంగాణను కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధన ఆశయం కోసం ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ ఢిల్లీలో ప్రతిఒక్కరిని కలుపుకొనిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్రణాళికలు రచించి, తన శక్తియుక్తులన్నీ ధారపోశారని కొనియాడారు. చివరికి ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారు. అందరూ రాదు రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రికార్డ్ టైంలో నిర్మించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్గా నిలిపారని తెలిపారు. ఇంత చేస్తున్నా కేసీఆర్ణు కొందరు దూషిస్తున్నారు. అనరాని మాటలంటున్నారు. ఇలాంటి సమయంలో మనోహర్ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను తప్పకుండా చదువుతాను. నా అభిప్రాయాన్ని, రివ్యూను ట్వీట్ చేస్తానని కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డితో పాటు స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం కూడా పాల్గొన్నారు.